పవన్ కళ్యాణ్పై ఉత్కంఠ: చంద్రబాబును తప్పు పడ్తారా?
హైదరాబాద్: తాజా పరిణామాలపై రెండు రోజుల్లో ప్రతిస్పందిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏం చెప్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఆయన ఏం మాట్లాడుతారనేది ఆసక్తికరమైన విషయమే. సహజంగానే ఉద్వేగపూరిత ప్రసంగం చేసే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. ఆయన అభిమానులు కూడా ఆయన ప్రకటన కోసం ఆసక్తిగా చూస్తున్నారు.
నోటుకు ఓటు కేసు నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న తాజా పరిణామాలపై రెండు సార్లు కూడా ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యల్లో కూడా ఆయన నోటుకు ఓటు కేసు ప్రస్తావన తేలేదు. ఆయన ప్రతిస్పందనలో కూడా నోటుకు ఓటు కేసును ప్రస్తావించకపోవచ్చునని అంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించే అవకాశం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది.
'తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు అంటారని, అలాగే పాలకులు బాధ్యత లేని ప్రవర్తనతో, మాటలతో ప్రభుత్వాలని నడిపితే భావితరాల మధ్య తిరిగి కోలుకోలేనంత అంతర్యుద్ధాలు సంభవిస్తాయని పవన్ కళ్యాణ్ రెండోసారి చేసిన ట్వీట్లో చెప్పారు. రెండు రోజుల్లో లేదా వారంలో తాజా పరిణామాలపై స్పందిస్తానని చెప్పారు. నాయకుడి పాలన ప్రభావం ప్రతి అంశం పైన ఉంటుందని మన పెద్దవారు చెప్పారని, మన నాయకులు మనలను ఎలా ముందుకు తీసుకు వెళ్తారో ముందు ముందు చూద్దామని ట్వీట్ చేశారు.
అంతకు ముందు నెల్సన్ మండేలా నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ట్విట్టర్లో స్పందించారు. నెల్సన్ మండేలా పంథాలో ముందుకు సాగాలని ఆయన రాజకీయ నాయకులకు హితవు చెప్పారు. తెగే దాకా లాగొద్దంటూ హితవు పలికారు. రాజకీయాలు పరస్పరం ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదని ఆయన అన్నారు. మన రాజకీయ నాయకుల మాదిరిగానే నెల్సన్ మండేలా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని ఆయన అడిగారు.
వివక్ష చూపుతున్న ప్రభుత్వం, తెల్ల జాతీయుల పట్ల నెల్సన్ మండేలా వ్యవహరించిన తీరును గుర్తు చేసుకోవాలని ఆయన నాయకులకు సూచించారు. ప్రజల సుదీర్ఘ ప్రయోజనాల కోసం, మంచి కోసం నెల్సన్ మండేలా ఉత్తమ మార్గాన్ని ఎంచుకున్నారని, తద్వారా సివిల్ వార్ జరగకుండా చూశారని ఆయన అన్నారు. మన రాజకీయ నాయకులు తమ వ్యవహార శైలిని ఇదే విధంగా కొనసాగిస్తే ప్రజలు నష్టపోతారని ఆయన అన్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని ఆయన అన్నారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆ వ్యాఖ్యలను పరిశీలిస్తే, ఇరు రాష్ట్రాల నాయకులను తప్పు పడుతూ మాట్లాడే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిజానికి, పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. దాంతో నోటుకు ఓటు కేసులో చంద్రబాబు తీరును ఆయన తప్పు పట్టే అవకాశం లేదని అంటున్నారు. నోటుకు ఓటు కేసు తర్వాత సంభవిస్తున్న పరిణామాలను ప్రధానంగా తీసుకుని, ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషం రెచ్చగొట్టడానికి రాజకీయాలు పనిచేస్తున్నాయని మాత్రమే ఆయన అనవచ్చునని ఊహిస్తున్నారు.