పవన్ సాయంకోరిన బాబు, గంటన్నర భేటీలో అధికారులు, కేఈ సంచలనం
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. రాజధాని నిర్మాణంలో సహకరించాలని కోరినట్లు చెప్పారు. భూసమీకరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఉదారంగానే అందించామని చెప్పారు. బడ్జెట్ కేటాయింపులలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు.
అంతకుముందు, చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే. దాదాపు గంటన్నర పాటు సమావేశం సాగింది. బడ్జెట్లో ఏపీకి మొండిచేయి చూపడంపై చంద్రబాబు, పవన్లు అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.
అలాగే భూసేకరణ, బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై పవన్ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. సాయంత్రం పవన్ మీడియాతో మాట్లాడే అవకాశముంది. కాగా, పవన్ కళ్యాణ్, చంద్రబాబుల భేటీలో సీఎం ముఖ్యకార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కేఈ సంచలన వ్యాఖ్య
తమది కేంద్రంతో మిత్రపక్షమో, ప్రతిపక్షమో అర్థం కావడం లేదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వేరుగా ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
బడ్జెట్లో కేంద్రం నుంచి ఎంతో ఆశించామని, కానీ నిరాశే మిగిలిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.ఐదువేల కోట్లు ఆశించామని కానీ రూ.వంద కోట్లు కేటాయించడం బాధ కలిగించిందన్నారు. ప్రస్తుతం తాము ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నామన్నారు.