ఒక్కటిగా: బాబు కంటే బాలయ్యే, రంగంలోకి పవన్, చిక్కుల్లో బీజేపీ
హైదరాబాద్: రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగలేదని విమర్శలు గుప్పిస్తున్న తెలుగుదేశం, జనసేన, వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు మూకుమ్మడిగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పైన తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు అరకొర నిధులు ఇవ్వడంపై మండిపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర విభజనను కోరుకోలేదని, వారి ఆకాంక్షలకు భిన్నంగా విభజన జరిగిందని అన్ని పార్టీలు చెబుతున్నాయి. విభజన బిల్లు సమయంలో కాంగ్రెస్ పార్టీతో పోటీపడి బీజేపీ హామీలు గుప్పించిందని, ఇప్పుడు మాత్రం వాటిని మరిచిపోయిందని విమర్శిస్తున్నారు.
విభజన వల్ల ఏపీయే ఎక్కువ నష్టపోయిందని, లోటు బడ్జెట్ ఉందని, రాజధాని నిర్మించుకోవాల్సి ఉందని, ప్రభుత్వ కార్యాలయాలు కూడా లేవని, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం సహకారం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాన్ని తాము కోల్పోయినప్పుడు తమకు కేంద్రం ఎంతగా అండగా ఉండాలని నిలదీస్తున్నారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం తీరు పైన అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రంగంలోకి వచ్చారు. ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలవనున్నారు.
తాజాగా ఎమ్మెల్యే బాలకృష్ణ కేంద్రంపై నిప్పులు చెరిగారు. తమకు ముష్టివేశారంటూ చంద్రబాబు కంటే ఓ అడుగు ముందుకేసి విమర్శలు గుప్పించారు. ఇక, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు టీడీపీ - బీజేపీల పైన విమర్శలు గుప్పిస్తోంది. విభజన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు.
విపక్షాలు టీడీపీ, బీజేపీలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ.. అన్ని పార్టీలు కూడా ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు అరకొర నిధులు, విశాఖ ప్రత్యేక రైల్వే జోన్, లోటు బడ్జెట్... తదితర అంశాల పైన.. వేర్వేరుగా అయిన ఒకే సమస్య పైన నిలదీస్తున్నాయి.
పవన్ ఆరంగేట్రం, బాలయ్య ఆగ్రహం తర్వాత మరింత దూకుడు..
ఏపీకి బడ్జెట్లో అన్యాయం జరిగిందని టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు మొదటి నుండి మండిపడుతున్నాయి. అయితే, ఆదివారం నాడు పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబును కలిసి చర్చించడంతో ఈ అంశం మరింత వేడి రాజేసింది. ఇక సోమవారం బాలకృష్ణ.. తన బావ చంద్రబాబు కంటే అడుగు ముందుకేసి బీజేపీని ఎండగట్టారు. దీంతో దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
చిక్కుల్లో పడిన బీజేపీ..
పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబుతో కలవడం, కేంద్ర బడ్జెట్ పైన జనసేన చీఫ్ అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో బీజేపీ నేతలు స్పందించవలసిన పరిస్థితి స్పందించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ కూటమికి పవన్ విస్తత ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రధాని మోడీని ప్రశ్నించేందుకు ఆయననే బయటకు రావడంతో బీజేపీ నేతలు బడ్జెట్ పైన వివరణ ఇచ్చుకున్నారు.
ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు పవన్ కళ్యాణ్కు ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కేంద్రమంత్రి వెంకయ్య ఆదివారం మాట్లాడుతూ.. ఏపీకి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని, దీనిపై తాము దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడుతామని చెప్పారు. ఇదిలా ఉండగా, త్వరలో పవన్, చంద్రబాబు, బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి ఏపీకి న్యాయం చేయాలని కోరనున్నారు. అప్పుడు ఎంత వరకు న్యాయం జరుగుతుందో చూడాలి.