జైట్లీ భేటీలో 'పవన్': మోడీ కోసమా.. జగన్ని కార్నర్ చేసేందుకా?, అందుకేనని మురళీ మోహన్
న్యూఢిల్లీ: కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, టిడిపి నేత, కేంద్రమంత్రి సుజనా చౌదరి మంగళవారం నాడు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. తిరుపతి సభలో ఆయన చేసిన వ్యాఖ్యలను జైట్లీ దృష్టికి వెంకయ్య, సుజనలు తీసుకెళ్లారని తెలుస్తోంది.
సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ బీజేపీ, టిడిపిలకు చేసిన హెచ్చరికలు, అదే సమయంలో ఆయన మూడంచెలుగా చేస్తానని చెప్పిన హోదా ఉద్యమం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
మోడీ కోసమా, మోడీపై కోపమా?
పవన్ కళ్యాణ్ హోదా పైన చేసిన ప్రసంగాన్ని బీజేపీ నేతలు స్వాగతిస్తున్నారు. ఆయన ఎక్కువగా ఆ పార్టీ పైనే మండిపడ్డారు. కానీ, ఏపీ బీజేపీ నేతలు మాత్రం స్వాగతించారు. అంతేకాదు, ఇది ఢిల్లీ బీజేపీ నేతల దృష్టికి కూడావెళ్లింది. హోదా కోసం మూడు దశల్లో ఉద్యమిస్తానని పవన్ చెప్పారు.
ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల గడువు ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీకి మద్దతుగా నిలబడేందుకే పవన్ బయటకు వచ్చారా, లేక టిడిపికి మద్దతుగా వచ్చారా అనే చర్చ సాగుతోంది. ప్రత్యేక హోదా అంశాన్ని ఇటు కాంగ్రెస్, అటు వైసిపి క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
హోదా ఇవ్వలేమని చెప్పడంతో వైసిపి, కాంగ్రెస్ పార్టీలు మండిపడుతున్నాయి. టిడిపి ఇరుకున పడింది. అదే సమయంలో హోదా లేదా దానికి సమంగా ప్యాకేజీ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో అప్పటి దాకా బీజేపీ లేదా టిడిపిలను టార్గెట్ చేసి, వైసిపి, కాంగ్రెస్ పార్టీలు లబ్ధి పొందకుండా ఉండే ఉద్దేశ్యంలో భాగంగా వారిని కార్నర్ చేసేందుకు పవన్ వచ్చారా అనే చర్చ సాగుతోంది.
అందుకే గట్టిగా పోరాడలేకపోతున్నాం: మురళీ మోహన్
తాము ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్నామని, అందుకే ప్రత్యేక హోదా పైన గట్టిగా ప్రశ్నించలేకపోతున్నామని టిడిపి ఎంపీ మురళీ మోహన్ మంగళవారం నాడు అన్నారు. పవన్ ఆరోపించినట్లుగా టిడిపి ఎంపీలంతా ధనవంతులు కాదన్నారు. తమకు ఢిల్లీస్థాయిలో వ్యాపారాలు లేవన్నారు. హోదా కోసం అవసరమైతే రాజీనామాకు సిద్ధమన్నారు.