ఏపీ ప్రజలు అవమానాన్ని మర్చిపోరు, కాంగ్రెస్ది తప్పే: బిజెపి అలా వద్దని పవన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి కాంగ్రెస్ తప్పు చేసిందని అన్నారు.
పార్లమెంటులో ఎంపీలను బయటికి గెంటి రాష్ట్రాన్ని విభజించిందని చెప్పారు. సీమాంధ్ర ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఎవరూ మర్చిపోరని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ సీమాంధ్రుల నమ్మకాన్ని వమ్ము చేయదని ఆశిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
— Pawan Kalyan (@PawanKalyan) 30 April 2016
'సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం సీమాంధ్ర ఎంపీలను తన్ని.. పార్లమెంటులోంచి బయటికి గెంటి.. ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి.. కాంగ్రెస్ పార్టీ ఒక ఘోరమైన తప్పు చేసింది' అని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
'ఆ రోజు సీమాంధ్ర ప్రజలకు జరిగిన అవమానం ఎవరు మరిచిపోలేదు.. మరిచిపోరు కూడా..' అని పవన్ తెలిపారు. అంతేగాక, 'ఈ రోజు ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాట మీద వెనక్కి తగ్గి, సీమాంధ్ర ప్రజల నమ్మకం మీద కొట్టి 'బిజెపి' కూడా అలాంటి తప్పు వైపే అడుగులు వెయ్యకూడదని నేను కోరుకుంటున్నాను' అని స్పష్టం చేశారు.
ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన దిగకముందే.. హోదా కోసం ఏపీ అధికార, ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటులో పోరాటం చేయాలని అన్నారు. సీమాంధ్ర తరపున ఎంపీలకు ఇదే తన విన్నపమని చెప్పారు.
— Pawan Kalyan (@PawanKalyan) 30 April 2016
ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని ఓ కేంద్రమంత్రి పార్లమెంటులో వ్యాఖ్యానించినట్లు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పైవిధంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఏపీకి చెందిన పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.