చంద్రబాబుకు రాజధాని షాకేనా: పవన్ కళ్యాణ్ చూస్తున్నారు?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంపై మౌనంగా లేరని తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం చేస్తున్న భూసమీకరణ పైన ఆయన మానిటరింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.
రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం బలవంతంగా భూమిని సేకరిస్తే తాను రైతుల పక్షాన నిలబడతానని, అవసరమైతే రోడ్డెక్కుతానని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితం అతను రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులకు హామీ ఇచ్చారు.
ఆ తర్వాత కూడా సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. రాజధాని కోసం భూములు ఇవ్వని రైతుల మీద భూసేకరణ చట్టం ప్రయోగిస్తే నేను రైతుల తరఫున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ట్వీట్ చేశారు.
అయితే, పవన్ కళ్యాణ్ ఆ అంశాలను అంతటితో వదిలేయలేదని, వాటిపై సమీక్షిస్తున్నారని తెలుస్తోంది. బలవంతంగా భూమిని సేకరిస్తే ఏం చేయాలనే దాని పైన ఆయన ఆలోచిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక రైతులు కూడా పవన్ కళ్యాణ్ పైన ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు.