పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్: ఆంధ్రొళ్లు అనొద్దు, సెక్షన్ 8 పెట్టి తెలంగాణ ప్రజల సంతోషం లాక్కోవద్దు
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలపై సోమవారం మాట్లాడారు.
తనకు అవసరమైనప్పుడు మాట్లాడటం తప్ప నోరు పారేసుకోవడం తెలియదన్నారు. తెలుగు జాతి ఐక్యత దేశ సమగ్రతకు అవసరమని గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారన్నారు. నేను చాలా తక్కువగా మాట్లాడుతానని చెప్పారు. రాజకీయ నాయకులకు నోరు పారేసుకోవడమే తెలుసన్నారు.
ఏది మాట్లాడనా బాధ్యతాయుతంగా మాట్లాడాలన్నారు. పవన్ పార్టీ పెట్డాడు, తప్పించుకుంటాడని చెబుతుంటారని కాని తనకు నోరు పారేసుకోవడం తెలియదన్నారు. కాంగ్రెస్ నేత వీ హనుమంత రావు కూడా తనను మాట్లాడాలని డిమాండ్ చేశారన్నారు.
రాష్ట్రం విడిపోయింది కాబట్టి అందరూ బాధ్యతాయుతంగా మాట్లాడాలన్నారు. యాదాద్రికి ఏపీ ఆర్కిటెక్చర్ను పెట్టడంతో తెలుగు జాతి ఐఖ్యతకు కెసిఆర్ తొలి అడుగు వేశారని, అందుకు కెసిఆర్కు ధన్యవాదాలు అన్నారు.
వర్తమాన పరిస్థితుల్లో ఏ పార్టీకి నిజాయితీ లేదన్నారు. విభజనలో ఇంకా తేలాల్సి ఉన్నాయన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో నీతి, నిజాయితీలకు ఆస్కారం లేకుండా పోయిందన్నారు. ఏ పార్టీలోను నీతి, నిజాయితీలు ఉన్నవారు లేరన్నారు.
ఫోన్ ట్యాపింగ్ పైన...
ఫోన్ ట్యాపింగ్ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయమన్నారు. పొలిటికల్ గేమ్కు అలవాటుపడి ట్యాపింగ్ చేయడం విడ్డూరమన్నారు. విభజన కారణంగా ఇంకా సమస్యలు ఉన్నాయన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ను టీఆర్ఎస్లోకి తీసుకు వచ్చారు కానీ సనత్ నగర్ ప్రజల విశ్వాసం మాటేమిటన్నారు.
విభజన తర్వాత రెండురాష్ట్రాల సీఎంలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. తన కంట్లో దూలం పెట్టుకొని ఎదుటివారి కంట్లో నలుసుపై మాట్లాడటం సరికాదన్నారు. ఇరు రాష్ట్రాలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయన్నారు.
మోడీకి నేను చెప్పానని... తెలంగాణ, ఆంధ్రా సున్నిత అంశమని చెప్పానని తెలిపారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని అన్నారు. అప్పుడే విడదీస్తే సమస్య వచ్చేది కాదన్నారు. ఏపీలో డబ్బుల్లేవని, తెలంగాణలో మిగులు ఉందన్నారు.
తెలంగాణ, ఏపీలకు యూపీఏ, ఎన్డీయేలు బాధ్యత వహించాలన్నారు. ఇలాగే ఉంటే అంతర్యుద్ధం తప్పదన్నారు. నేను ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తున్నానని, తెలుగు రాష్ట్రాల గొడవలను పట్టించుకోవాలని కోరారు.
ఫోన్ ట్యాపింగ్ అబద్దమో నిజమో తనకు తెలియదని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. నిజమైతే శిక్ష తప్పకుండా వేయించాలన్నారు. ట్యాపింగ్ తీవ్ర అంశమన్నారు.
ఓ జాతిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఆంధ్రులు, సెటిలర్లు అనే పదం వాడవద్దన్నారు. ఉద్యమం సమయంలో వాడితే అభ్యంతరంలేదని, ఇప్పుడు బాధ్యతగల పదవుల్లో ఉండి ఆంధ్రోళ్లు అనే పదం వాడవద్దన్నారు. హరీష్ రావు ఈ పదాన్ని ఎక్కువగా వాడుతున్నారన్నారు.
ఆంధ్రోళ్లు అంటే ఓ కులం కాదన్నారు. ఆంధ్రోళ్లు అని తిట్టవద్దన్నారు. మీకు కావాలంటే చంద్రబాబును, టీడీపీని లేదా నన్ను తిట్టుకోవచ్చునని చెప్పారు. కానీ ఆంధ్రాలో హిందువులు, క్రిష్టియన్లు, ముస్లీంలు, వివిధ కులాల వారు ఉన్నారని, అలాంటప్పుడు ఆంధ్రొళ్లు అని తిట్టవద్దన్నారు. చంద్రబాబును పార్టీ పరంగా తిట్టుకోవచ్చన్నారు.
కెసిఆర్ విజయనగరం జిల్లా నుంచి వచ్చిన ఆనందసాయిని యాదాద్రికి ఆర్కిటెక్చర్గా పెట్టారని, తెలుగు జాతి స్ఫూర్తిని చాటారని, ప్రజల్లోకి దీనిని తీసుకు వెళ్లాలని కోరారు.
రేవంత్ రెడ్డి వ్యవహారంపై మాట్లాడుతూ.. అది కోర్టు తేలుస్తుందని చెప్పారు. ఓటుకు నోటు కేసు తప్పా కాదా అన్నిది న్యాయస్థానం పరిధిలో ఉందన్నారు.
సెక్షన్ 8 పెట్టి తెలంగాణ ప్రజల సంతోషం దూరం చేయవద్దు
కచ్చితంగా కేంద్రం ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిందన్నారు. విభజనతో ఏపీకి అన్యాయం చేశారని, సెక్షన్ 8 కూడా తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తే అది మరో తప్పు అవుతుందన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరూ తమకు సమానమేనని చెబుతారని గుర్తు చేశారు.
వచ్చే పదేళ్లు రెండు రాష్ట్రాలకు కీలకమన్నారు. రాజకీయ నాయకులు ఆలోచించి, బరువుతో మాట్లాడాలని సూచించారు. విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు.
కాంగ్రెస్, బీజేపీ సభ్యులతో కమిటీ వేయాలన్నారు. హైదరాబాదులోని వ్యవహారాలను పరిశీలించాలని సూచించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రధాని నేరుగా మానిటర్ చేసే ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.
సీమాంధ్రుల భద్రతలకు చర్యలు తీసుకోవాలన్నారు. సెక్షన్ 8 పెట్టి తెలంగాణ వచ్చిన సంతోషాన్ని తెలంగాణ ప్రజలకు దూరం చేయవద్దని చంద్రబాబుకు సూచించారు.
మీడియా స్వేచ్ఛను హరించవద్దు
మీడియా స్వేచ్ఛను హరించవద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. తెలంగాణలో కొన్ని చానళ్లను, ఏపీలో అప్రకటితంగా కొన్ని చానళ్లను అడ్డుకుంటున్నట్లుగా తెలుస్తోందని, ఇది సరికాదన్నారు. పత్రికా స్వేచ్ఛను ప్రజలు అడ్డుకోవద్దన్నారు.
హైదరాబాద్ హక్కులపై...
సీమాంధ్ర పాలకులు గుర్తించాల్సింది ఏమంటే.. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసింది నిజమేనని, కానీ హైదరాబాదే అనుకోవద్దన్నారు. హైదరాబాదు పైన కెసిఆర్ భావన మారాలని హితవు పలికారు.
నాగార్జున సాగర్ వద్ద పోలీసులు కొట్టుకోవడం చూసి బాధపడ్డానన్నారు. దీనికి ఇద్దరు ముఖ్యమంత్రులు బాధ్యత వహించాలన్నారు. సివిల్ వార్ వస్తుందేమోననే ఆందోళన కలుగుతోందన్నారు. కెసీఆర్కు ఎంతో బాధ్యత ఉందని, దానిని మర్చిపోవద్దన్నారు.
రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఏ గొడవలు లేకుండానే ఆస్తులు ధ్వంసం చేశారన్నారు. అన్ని రాజకీయ పక్షాలు, నాయకులు, ప్రజా సంఘాలు కలుపుకొని వెళ్లాలన్నారు. సమస్యను కేవలం తెలంగాణ కోణం నుంచి, సీమాంధ్ర కోణం నుంచి చూడవద్దన్నారు.
నెల రోజులుగా ఇరు ప్రభుత్వాలు సమస్యలను గాలికి వదిలేశాయన్నారు. చంద్రబాబు పైన కేసు నమోదయినంత మాత్రాన సెక్షన్ 8 రాదన్నారు. తెలంగాణ రావడానికి ఎంతోమంది బలిదానం చేసుకున్నారని, ఆ బాధ్యత తన పైన ఉందని కెసిఆర్ గుర్తించాలన్నారు.