ఫ్యాన్స్ హంగామా, పవన్పై నమ్మకం ఉందని రైతులు
గుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం రాజధాని ప్రాంతానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన రాజధాని ప్రాంతానికి బయలుదేరారు. ఉదయం పదింపావుకు ఉండవల్లికి చేరుకున్నారు.
పవన్ ఈ రోజు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తారు. తొలుత పలు గ్రామాల రైతులతో మాట్లాడుతారు. అక్కడి నుండి ఉండవల్లి, ఎర్రబాలెం, బేతపూడి, తుళ్లూరు గ్రామాలకు చేరుకొని అక్కడి రైతులను కలుస్తారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. పవన్ ఉండవల్లికి చేరుకోవడంతో అభిమానులు, ప్రజలు పవన్ పవన్ అంటూ కేకలు వేశారు.
'పవన్ కళ్యాణ్ పైన నమ్మకం ఉంది'
పవన్ కళ్యాణ్ ఉండవల్లి గ్రామంలో నేపథ్యంలో.. స్థానిక రైతులు, మహిళలు ఆయన పైన భరోసా పెట్టుకున్నారు. టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ తమ డిమాండుకు న్యాయం చేస్తారని భావిస్తున్నామని చెప్పారు. తాము ఎట్టి పరిస్థితుల్లోను రాజధాని ప్రాంతానికి భూమి ఇవ్వమని చెప్పారు. తమకు పరిహారం దక్కుతుందన్న నమ్మకం లేదన్నారు. కాగా పవన్తో మాట్లాడేందుకు, చూసేందుకు వేలాదిగా జనాలు తరలి వచ్చారు. పవన్ భద్రత లేకుండా రాజధాని ప్రాంతానికి వచ్చారు. దీనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.