ఏపీ, టీలపై మాట నిలుపుకుంటున్న పవన్! జగన్కు ధీటుగా తెరపైకి
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు! నిన్నటి వరకు తాను మద్దతు పలికిన... ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబులను ఆయన నిలదీయనున్నారు.
ఏపీ సమస్యలపై స్పందించేందుకు పవన్ రావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సైడ్ చేసినట్లయిందని అంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వాలు విఫలం కావడంపై పవన్ ప్రశ్నిస్తే.. అది జగన్ 'విమర్శ అనే ఆయుధానికి' మరింత పదును అవుతుందని మరికొందరు అంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల అనంతరం పవన్ తాను మద్దతు పలికిన పార్టీలను నిలదీసేందుకు తొలిసారి ముందుకు రావడంపై పలువురు కితాబిస్తున్నారు.
రైల్వే, సాధారణ బడ్జెట్లలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఊరట లభించలేదు. బడ్జెట్ పైన తెలంగాణకు తెరాస కొంత సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, ఏపీలో అధికారంలో తెలుగుదేశం పార్టీ మాత్రం పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేసింది.
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చే హామీల పైన బీజేపీ నాటి అధికార కాంగ్రెస్ పార్టీతో పోటీ పడింది. ఇప్పుడు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, స్పెషల్ ప్యాకేజీ తదితర అంశాలలో పూర్తిగా అసంతృప్తికి గురి చేసింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ సహా అందరు అసంతృప్తితో ఉన్నారు. ఇదే అదనుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైన విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
మరోవైపు, రాజధాని భూసమీకరణ పైన పలువురు రాజధాని ప్రాంత రైతులు అసంతృప్తితో ఉన్నారు. ఫిబ్రవరి 28తో భూసమీకరణ గడువు ముగిసింది. భూసమీకరణలో ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నప్పటికీ.. చాలామంది రైతులు భయపడి ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఏపీకి కేంద్రం సహకారం లేకపోవడం, భూసమీకరణపై రైతులు ఆందోళనలో ఉన్న ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. కొద్ది నెలల క్రితం తనను ప్రశ్నించిన వారి నోరు మూతపడేలా చేశారు. త్వరలో పవన్.. ఢిల్లీకి వెళ్లనున్నారు. అలాగే భూసమీకరణపై రైతులను సమస్యలు అడిగి తెలుసుకునేందుకు రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు.
ఢిల్లీ బాట పట్టనున్న పవన్ కళ్యాణ్ కేంద్రంతో ఏపీతో పాటు తెలంగాణకు రావాల్సిన కేటాయింపుల పైన అడిగే అవకాశముంది. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్, స్పెషల్ ప్యాకేజీ, భూసేకరణ బిల్లు, తెలంగాణకు నిధులు, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ తదితర అంశాలపై కేంద్రంతో చర్చించే అవకాశముందని అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల సమస్యల పైన స్పందించేందుకు సిద్ధం కావడం ద్వారా పవన్ కళ్యాణ్ మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమయ్యారు. పవన్ బయటకు రావడం ఓ వైపు జగన్ను సమస్యల పైన సైడ్ లైన్ చేయడమవుతుందని కొందరు అంటుండగా, ఆయనకు మరో ఆయుధం దొరికిందని ఇంకొందరు అంటున్నారు.
బాబుకు పవన్ మద్దతు
రాజధాని ప్రాంతంలోని రైతులకు పవన్ అండగా నిలబడనున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించనున్నారు. అదే సమయంలో ఏపీకి కేంద్రం సహకారం విషయంలో చంద్రబాబుకు అండగా నిలబడనున్నారు.
ఇటీవలే హెచ్చరించిన పవన్
వారం రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ఎన్డీయే, టీడీపీ ప్రభుత్వాలను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఎంతో నమ్మకంతో ప్రజలు టీడీపీ - బీజేపీలను గెలిపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. రైతు కన్నీరు పెట్టకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉందని, లేదంటే వారి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని మరో ట్వీట్లో హెచ్చరించారు.