గోరటి ఎంకన్న పాట గుర్తు చేసి వైఎస్ను ఉతికేసిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్: తెలంగాణ గేయ రచయిత గోరటి ఎంకన్న పాట పల్లె కన్నీరు పెడుతూందోను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుర్తు చేసి, గత వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో జరిగిన భూసేకరణ విధానాన్ని ఉతికి ఆరేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరును కూడా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూసేకరణ విధానంపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ వైయస్ హయాంలో సెజ్లకు భూసేకరణ జరిగిన తీరును, వాటిని ఉపయోగించిన తీరును తప్పు పట్టారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పోలేపల్లి సెజ్ రైతులు తన వద్దకు వచ్చారని ఆయన చెప్పారు. వైయస్ హయాంలో భూసేకరణ విధానంలో తప్పులు జరిగాయని, అక్రమాలు జరిగాయని తాను అన్నానని, ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా అన్నారని ఆయన అన్నారు. వైయస్ హయాంలో 4 వేల ఎకరాలు బలవంతంగా లాక్కున్నారని ఆయన చెప్పారు. భూములు సేకరించినప్పుడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నా అంటే, అదీ లేదని ఆయన అన్నారు.
సెజ్లకు కేటాయించిన భూముల్లో పరిశ్రమలు పెట్టాల్సింది పోయి ఆ భూములను అమ్ముకున్నారని ఆయన గుర్తు చేశారు. రైతుల నుంచి లాక్కున భూముల్లో పరిశ్రమలు పెట్టకుండా అమ్మేసుకున్నారని ఆయన చెబుతూ వాన్పిక్ వ్యవహారాన్ని ప్రస్తావించారు. కృష్ణపట్నం ఓడరేవు విషయాన్ని ప్రస్తావించారు. ఒక కంపెనీకే ఎపిలోని 40 శాతం పైచిలుకు తీరప్రాంతాన్ని ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. సింగపూర్ ఓడరేవు విషయానికి వస్తే ఎపితో దానికి ఏ మాత్రం పోలిక లేదని ఆయన అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే భూములు తిరిగి ఇప్పిస్తానని అంటున్నారని, ఆయన రాజకీయం కోసమే ఆ ప్రకటన చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. సెజ్ల భూసేకరణ, దాని వాడకం విషయాల్లో జరిగిన అక్రమాల గురించి మాట్లాడితే కోర్టులకు వెళ్తారని, వేల కోట్ల రూపాయలకు దోపిడీ చేసేవారికి రక్షణ ఉందని, రైతులకూ రైతు కూలీలకు ఏ విధమైన రక్షణ లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. సెజ్ విషయంలో చాలా అవకతవకలు జరిగాయని ఆయన అన్నారు. రైతులకు, రైతు కూలీలకు అన్యాయం జరిగినప్పుడు తనలాంటి వాళ్లు మాట్లాడక తప్పదని ఆయన అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధిని ఎంత వేగంగా చేయగలుగుతారని, సింగపూర్ రాజధాని నిర్మాణానికి 20, 25 ఏళ్లు పట్టిందని, ఎపి రాజధాని నిర్మాణానికి కూడా అంత సమయం పట్టవచ్చునని, ఈలోగా ఏం జరుగుతుందనే విషయంలో కొన్ని అనుభవాలున్నాయని పవన్ కళ్యాణ్ అంటూ హైదరాబాదులో భూమి కేటాయింపులు జరిగితే ఏం జరిగిందో తెలుసునని ఆయన అన్నారు. దాని అమలుకు నిబద్ధత గల నాయకత్వం కావాలని, సింగపూర్లో అటువంటి నాయకత్వం ఉందని ఆయన అన్నారు.
భూములు సేకరించిన తర్వాత ఇష్టం వచ్చినవారికి ఇచ్చేస్తున్నారని అన్నారు. మన వద్ద రాజకీయ అవినీతి చాలా ఉందని, దాన్ని ఎవరూ కాదనలేరని, రాజధాని నిర్మాణానికి సేకరించిన భూముల విషయంలో కూడా భవిష్యత్తులో అలా జరగదనే గ్యారంటీ ఏమీ లేదని ఆయన అన్నారు. రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందితే రైతులకు మాత్రమే ఉపయోగపడుతుందా అనేది సందేహమని ఆయన అన్నారు. రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం మంచిదే, కానీ ఆ తర్వాత ఉద్దేశం నెరవేరడం లేదని ఆయన అన్నారు. పోలేపల్లి సెజ్ వ్యవహారం చాలా బాధ కలిగించిందని ఆయన అన్నారు. భూసేకరణ వల్ల, దాని తర్వాతి పరిణామాల వల్ల సంభవించే సామాజిక ప్రభావాలను గురించి ఆలోచించాలని ఆయన అన్నారు.
రైతుల జీవనాధారాన్ని చంపేయవద్దని ఆయన అన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన రైతు కూలీలు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. రక్షణ సంస్థల వంటివాటికి భూసేకరణ చేసే విషయంలో సామాజిక ప్రభావాల అంచనా అవసరం లేదని మోడీ అంటున్నారని, కానీ అది సరి కాదని ఆయన అన్నారు. సామాజిక ప్రభావాల అంచనా అవసరం లేదనుకుంటే సామాజిక అశాంతి తలెత్తుతుందని ఆయన అన్నారు. తెలంగాణలో అదే విధంగా జరిగిందని ఆయన అన్నారు. సింగపూర్, మలేషియా వంటి రాజధానులు ఉంటే మంచిదేనని, కానీ సామాజిక అశాంతి రగలకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుందని ఆయన అన్నారు.