టిడిపి నేతగా రాలేదు: పవన్ కళ్యాణ్ షాకివ్వడంతో ఎమ్మెల్యే, ఫ్యాన్స్కూ..
చిత్తూరు: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం నాడు తిరుపతి బహిరంగ సభ సమయంలో, అంతకుముందు ఇటు అభిమానులకు, అటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సుగుణమ్మకు ఝలక్ ఇచ్చారు!
ఉదయం పవన్ కళ్యాణ్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన తిరుపతి సభకు బయలుదేరారు. పెద్ద ఎత్తున అభిమానులు ఆయనను చూసేందుకు తరలి వచ్చారు. ఈ సమయంలో జరిగిన తోపులాటలో ఆయన కిందపడపోయారు.
అదే సమయంలో పవన్ కళ్యాణ్తో తిరుపతి టిడిపి ఎమ్మెల్యే సుగుణమ్మ భేటీ అయ్యారు. తొలుత ఆయన నుంచి ఆమెకు అనుమతి లభించలేదు. దీంతో ఆమె కొంచెం సేపు వేచి చూశారు. తాను టిడిపి తరఫున రాలేదని, మీ అభిమానిగా వచ్చానని చెప్పడంతో పవన్ ఆమెను లోనికి అనుమతించారు.
పవన్ సభ వెనుక మరో కోణం, ఎన్నో అనుమానాలు
అభిమానుల నినాదం పట్టించుకోని పవన్ కళ్యాణ్
తిరుపతిలోని ఇందిరా మైదానం వేదికగా పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభలో ఆసక్తికర నినాదాలు వినిపించాయి. పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా ఆయన అభిమానులు అభివర్ణించారు. అయితే ఈ నినాదాలు తన చెవిన పడ్డా కూడా పవన్ కళ్యాణ్ మౌనం దాల్చారు.
పలుమార్లు అభిమానులు చేసిన నినాదాలకు ఆయన స్పందించారు. కానీ పవన్ సీఎం అంటూ చేసిన నినాదాలకు మాత్రం ఆయన స్పందించలేదు. ఈ సభకు తిరుపతి నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
జనాన్ని చూసి రెట్టించిన ఉత్సాహంతో ఏపీకి ప్రత్యేక హోదాపై గళమెత్తిన పవన్ కళ్యాణ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆ తర్వాత ఆయన వేదిక దిగుతున్న సమయంలో జనం నుంచి 'సీఎం పవర్ స్టార్', 'జై పవనిజం' అంటూ పెద్ద పెట్టున నినాదాలు వినిపించాయి. ఆ నినాదాలను విన్నా, విననట్టే ఆయన వెళ్లిపోయారు.