టీ కోసం ఇద్దరు ఎంపిలే, టిడిపి ఎంపిలు అంత మంది: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అప్పట్లో ఇద్దరు పార్లమెంటు సభ్యులు పోరాటం చేశారని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడానికి అంత మంది పార్లమెంటు సభ్యులున్నారని, వారు పోరాటం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్ని సార్లు ఢిల్లీకి తిరుగుతామని ఆయన అడిగారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం సరి కాదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో టిడిపి ఎంపీలు పోరాటం చేయాలని ఆయన అన్నారు.
అవసరమైనప్పుడు తాను ఎపికి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తానని ఆయన చెప్పారు. పక్క రాష్ట్రాల పేరు చెప్పి ప్రత్యేక హోదా ఇవ్వడంలో జాప్యం చేయడం తగదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం తాను బిజెపి నేతలతో మాట్లాడుతానని ఆయన చెప్పారు. అప్పుడు కూడా ఫలితం రాకపోతే పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా కోసం తాను అడుగుతానని, తనను పిలుస్తారని అనుకుంటున్నానని ఆయన అన్నారు.
తెలంగాణ కోసం ఇద్దరు ఎంపిలు అంతగా పోరాటం చేసినప్పుడు టిడిపి ఎంపీలు ఎందుకు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడం లేదని ఆయన అడిగారు. సర్ది చెప్పే మాటలు వినీవినీ విసిగిపోయామని ఆయన అన్నారు. టిడిపి ఎంపీలు కచ్చితంగా మాట్లాడాలని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి సమస్యలున్నాయని అంటున్నారని, మీరిచ్చిన మాటపైనే మీరు వెనక్కి పోతే ఎలా అని అడిగారు.