చేతకాకుంటే రాజీనామా చేయండి: బీజేపీ-టీడీపీలకు పవన్ షాక్, ప్రత్యేక హోదాపై..
హైదరాబాద్: తెలంగాణ ఎంపీలను స్ఫూర్తిగా తీసుకొని సీమాంధ్ర ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని, లేదంటే రాజీనామా చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఏపీకి ప్రత్యేక హోదా పైన ఇప్పుడు ఎవరు మాట్లాడటం లేదన్నారు. ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగడం లేదన్నారు. బీజేపీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారని, వారు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. వివిధ సందర్భాల్లో బాగా మాట్లాడే నేతలు ఇప్పుడేం మాట్లాడటం లేదన్నారు.
నా వ్యక్తిగత అభిప్రాయాలు, ఐడియాలజీ పక్కన పెట్టి నేను టీడీపీ, బాబుకు మద్దతిచ్చానని చెప్పారు. కానీ, ఎవరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదన్నారు. తెలంగాణ కోసం పోరాడిన ఎంపీలను స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేక హోదా గురించి సీమాంధ్ర ఏంపీలు పోరాడాలన్నారు. వ్యాపారాల కోసమే ఎంపీలు అయ్యామంటే మీరు రాజీనామా చేయండని మండిపడ్డారు.
కావూరి సాంబశివ రావు, దగ్గుబాటి పురంధేశ్వరి, రాయపాటి సాంబశివ రావు, కేశినేని నాని తదితరుల పేర్లను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. అశోక్ గజపతి రాజు సహా అందరూ అవసరమైతే పదవులకు రాజీనామా చేయాలన్నారు.
ప్రధాని మోడీ ఏమైనా అంటారనో, బెదిరిస్తారనో, వ్యాపారాల కోసమే వద్దన్నారు. ప్రత్యేక హోదా తేవడం తమ వల్ల కాదంటే జనం వద్ద ఒప్పుకోవాలని హితవు పలికారు. కాగా, చంద్రబాబును ఆంధ్రాబాబు అనడం సరికాదని కెసిఆర్కు హితవు పలికారు.