తాడో.. పేడో.. పవన్ ఎటువైపు? : భజనపరున్ని కాదన్నాడు, చేతల్లో నిరూపిస్తాడా?
కాకినాడ : పాము చావాలి గానీ కర్ర విరగవద్దు.. అన్న వ్యవహారం అన్ని విషయాల్లో పనికిరాదు. ముఖ్యంగా రాజకీయాల్లో తాడో పేడో తేల్చుకోవాల్సిన సందర్బం వచ్చినప్పుడు కూడా.. ఇంకా నాన్చుడు ధోరణిని కొనసాగిస్తే.. భవిష్యత్తులో పొలిటికల్ మైలేజ్ కు భారీ దెబ్బ పడ్డట్లే. ఇదే విషయాన్ని పవన్ రాజకీయాలకు అనువదిస్తే.. ఇప్పటిదాకా సుతిమెత్తగానే కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలిస్తూ వస్తోన్న పవన్.. ఇప్పుడైనా బలమైన వ్యతిరేక స్వరం వినిపించగలరా అన్నది ఆసక్తికరం.
నేనే పార్టీకి భజన పరున్ని కాదు.. ఏ పార్టీకి కొమ్ము కాయట్లేదంటూ.. గత తిరుపతి సభలో తనపై విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు పవన్. అయితే ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైందనేది ఏపీలో చాలామంది ప్రజానీకం అభిప్రాయం. నిజంగా ప్రజా ప్రయోజనాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టే తత్వమే గనుక పవన్ లో ఉంటే.. ఈరోజు కాకినాడ వేదికగా జరిగే సభ ద్వారా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది.
ఒకవేళ గతంలో మాదిరే.. కేంద్రంపై, చంద్రబాబుపై తనకు నమ్మకముందంటూ.. పాత డైలాగ్స్ నే పవన్ రిపీట్ చేస్తే.. జనంలోను పవన్ పై వ్యతిరేకత ఏర్పడే అవకాశం లేకపోలేదు. కేంద్రంతో పొత్తు, ఓటుకు నోటు కేసు లాంటి చిక్కులతో కేంద్రాన్ని గట్టిగా నిలదీసే స్థితిలో ఏపీ సీఎం చంద్రబాబు లేరు. అలాగే ఇప్పటికీ అవినీతి కేసుల్లో జగన్ పై కేసులు ఇంకా ఉండనే ఉన్నాయి. కాబట్టి చంద్రబాబునైతే జగన్ విమర్శించగలరు గానీ ప్రధాని మోడీని ప్రత్యక్షంగా ఎదుర్కోవడం జగన్ వల్ల అవుతుందా అనేది అనుమానమే.
ఇలాంటి తరుణంలో.. ఏపీ ప్రజల్లో కొంతలో కొంత పవన్ పై నమ్మకం ఉంది. ఆయనకున్న భారీ ఫాలోయింగ్ కావచ్చు.. క్షణాల మీద నిర్ణయాలతో ప్రభుత్వాల్లో కదలిక తెప్పించగలరన్న నమ్మకం కావచ్చు.. హోదాను సాధించగలిగే సత్తా సామర్థ్యం ఆయనలో ఉందన్న అభిప్రాయం జనాల్లో కొంతమేర ఉంది. ఇప్పుడిక అటో.. ఇటో.. తేల్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది కాబట్టి.. కేంద్రాన్ని రాష్ట్రాన్ని ధీటుగా ఎదుర్కొంటూ.. హోదా సాధించడం కోసం జనం ముందు పవన్ నిలబడుతారా లేదా అన్నది ఇక వేచి చూడాలి.