బాబు అర్థం చేసుకున్నారు, థ్యాంక్స్: పవన్, అమాంతం పెరిగిన ఇమేజ్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. భూసేకరణ బిల్లును తాము వెనక్కి తగ్గినట్లు మంత్రి నారాయణ ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
రాజధాని నిర్మాణంలో భూసేకరణ ఆపే దిశగా అడుగులు వేస్తున్నందుకు రాష్ట్ర మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారు, నారాయణ గారు, ఇతర మంత్రి వర్గ సభ్యులు అందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు అని ఓ ట్వీట్ చేశారు.
మరో ట్వీట్లో ముఖ్యంగా రైతుల మనోభావాలను సానుభూతితో పరిశీలించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.
అమాంతం పెరిగిన పవన్ ఇమేజ్!
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇమేజ్ అమాంతం మరింత పెరిగిందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ రోడ్డెక్కడం వల్లనే టిడిపి ప్రభుత్వం భూసేకరణ పైన వెనక్కి తగ్గిందని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఇది బలవంతపు భూసేకరణ నుంచి తప్పించుకున్న రైతులకు సంతోషం కలిగించే విషయం.
పవన్ కళ్యాణ్ వల్లే బలవంతపు భూసేకరణ ఆగిపోయిందని దాదాపు అందరు భావిస్తున్నారు. ఇది ఆయన ఇమేజ్ను మరింత ఎత్తుకు తీసుకు వెళ్లిందని చెప్పవచ్చు. ఆ గ్రామాలకు చెందిన రైతులు, ఇతరులు పవన్ కళ్యాణ్ను, చంద్రబాబును కలిసి థ్యాంక్స్ చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి.