పవన్ కళ్యాణ్, నాని ఎందుకు దుమ్మెత్తి పోసుకున్నారు: కారణం అదేనా?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీ ఎంపీలు, నేతలు మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేశినేని నాని వంటి వారు దుమ్మెత్తి పోశారు. పవన్ పైన విమర్శలు చేయవద్దని అధినేత చంద్రబాబు సూచించినా నేతలు ఘాటుగా స్పందించారని తెలుస్తోంది.
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. పవన్ వెనుక పొట్లూరి వరప్రసాద్ ఉన్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. విజయవాడ లోకసభ స్థానానికి పోటీ చేసేందుకే పవన్ కళ్యాణ్ వెనుక పొట్లూరి ఉన్నారనే ఊహాగానాలు సైతం వినిపించాయి.
అయితే, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ నుండి విరమించుకోవడం, టీడీపీ - బీజేపీలకు మద్దతు పలికడం జరిగింది. దీనిపై అప్పట్లో పొట్లూరి అలక వహించారనే వార్తలు వచ్చాయి.
ఇక, రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ సీమాంధ్ర ఎంపీల పైన విమర్శలు గుప్పించే సమయంలో మరీ ముఖ్యంగా కేశినేని నాని పేరును ప్రస్తావించారు. కేశినేని నాని వంటి వారు ఎంపీ టిక్కెట్టు తెచ్చుకునే సమయంలో ఉగ్రరూపం చూపించారని, తర్వాత మౌనం వహిస్తున్నారని పవన్ మండిపడ్డారు.
మరీ ప్రత్యేకంగా కేశినేని నాని పేరును తీసుకోవడం వెనుక నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన తీరును నేరుగా చూసినందువల్లే అని అంటున్నారు.
అంతేకాదు, పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేయవద్దని, ఆయన టీడీపీ మిత్రుడు అని చంద్రబాబు చెప్పాక.. మిగతా నాయకులు కొంత మిన్నకుండిపోయారని చెబుతున్నారు. కానీ కేశినేని నాని మాత్రం తీవ్రంగా దుమ్మెత్తి పోశారు.
నాటి ఎంపీ సీటు గొడవ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్.. కేశినేని నాని పైన మండిపడ్డారని, అందుకే కేశినేని నాని కూడా తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశారనే వాదనలు వినిపిస్తున్నాయి.