పవన్ వర్సెస్ ముద్రగడ!? : కుల రాజకీయం నిప్పు రాజేస్తోందా!
విజయవాడ : ఓవైపు హోదా, కాపు రిజర్వేషన్ల వంటి ప్రధాన సమస్యలు ఏపీ ప్రభుత్వాన్ని వెంటాడుతోంటే.. పవన్ పూర్తి స్థాయి రాజకీయ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటుండడం.. ప్రభుత్వంపై ఒత్తిడిని మరింత తీవ్రతరం చేస్తోంది. అదే సమయంలో.. సామాజిక వర్గ ప్రస్తావనలకు ఏమాత్రం ఇష్టపడని పవన్.. పాలిటిక్స్ కోసమైనా కులాల ప్రస్తావన చేయక తప్పదు కాబట్టి.. కాపు రిజర్వేషన్ల అంశంపై ఆయన స్టాండ్ ఏంటనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన అంశం.
ఇదంతా ఇలా ఉంటే.. ఇన్నాళ్లు కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతూ వస్తోన్న ముద్రగడ, పవన్ ఎంట్రీతో కాస్త ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. పవన్ గనుక రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తితే.. కాపు సామాజిక వర్గం ఎక్కడ ఆయన వెనక్కు వెళ్లిపోతుందేమో అన్న ఆందోళన.. ముద్రగడలో మొదలయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అందరివాడినే: దాసరి, ముద్రగడ భేటీలో చిరంజీవి, 'పవన్ వస్తే కాదనం'
ఈ నేపథ్యంలోనే.. కాపు సామాజిక వర్గం నుంచి బలమైన నేతలుగా ఎదిగిన దాసరి నారాయణరావు, చిరంజీవిల మద్దతుతో మరోసారి కాపు ఉద్యమం ఉద్రుతం చేయడానికి ముద్రగడ ప్రయత్నిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలైతేనే పవన్ కు ధీటుగా ఉండగలరని ముద్రగడ విశ్వసిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే.. పవన్ బహిరంగ జరిగిన రెండు రోజులకే దాసరి, చిరులతో భేటీ అయ్యారు ముద్రగడ.
ఇక సెప్టెంబర్ 9న జరగబోయే కాకినాడ సభలో.. పవన్ కాపు కుల రిజర్వేషన్లపై ఎలా స్పందిస్తారన్నది ప్రస్తుతం కాపు వర్గాల్లో సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. పొలిటికల్ మైలేజ్ కోసమైనా.. పవన్ క్యాస్ట్ పాలిటిక్స్ ను టార్గెట్ చేయొచ్చనే వాదన ఉంది. రిజర్వేషన్ల విషయంలో ముద్రగడ లాంటి నేతలకు పవన్ అండగా నిలబడుతారా.. అన్నది ప్రశ్నార్థకమే.
ముద్రగడతో సంబంధం లేకుండా కాపు రిజర్వేషన్లపై పవనే గనుక ప్రభుత్వ నిలదీసే పరిస్థితి వస్తే.. అప్పటిదాకా కాపు ఉద్యమ క్రెడిట్ దక్కించుకున్న ముద్రగడకు పవన్ పోటీగా మారే అవకాశముంది. అందుకే దాసరి, చిరులు తనవైపే నిలబడేలా.. ముద్రగడ ముందస్తు వ్యూహాలు రచిస్తున్నారనే చర్చ జోరందుకుంది. ఏదేమైనా.. కాకినాడ బహిరంగ సభ తర్వాతనే ఈ విషయాలన్నింటి పైన మరింత స్పష్టత వచ్చే అవకాశముండగా.. పవన్ పొలిటికల్ గా యాక్టివ్ కావడంతో.. కాపు కుల ప్రస్తావన ఏపీలో ఇప్పుడో హాట్ టాపిక్ గా మారింది.