ఎర్రచందనం స్మగ్లింగ్: సోము రవిపై పిడి యాక్ట్ నమోదు
కడప: ఎర్రచందనం స్మగ్లర్ సోము రవిపై పీడీయాక్ట్ నమోదు చేసిన పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. శేషాలచం అడవుల్లో ఎన్కౌంటర్ అనంతరం పోలీసులు ఎర్రచందనం స్మగ్లింగ్పై దాడులు మరింత పెంచారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టండంపై పోలీసులు దృష్టి సారించారు.
ఈ నేపథ్యంలో సోము రవి అనే వ్యక్తిపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పీడీయాక్ట్ నమోదు చేశారు. సోముపై 23 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చెన్నైలోని అన్నాసాలైకు చెందిన స్మగ్లర్ సోము రవి ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా కోట్లలో ఆస్తులు కూడబెట్టుకున్నాడు. ఈ క్రమంలో జనవరి 23న రేణిగుంట సమీపంలో పోలీసులు సోమును అదుపులోకి తీసుకుని తిరుపతి జైలుకు తరలించారు.
అతనిపై ఉన్న కేసులను పరిశీలించిన అనంతరం పీడీయాక్ట్ నమోదు చేసి కడప జైలుకు తరలించారు. సోము రవిపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులతో పాటు పోలీసులపై దాడులు చేసిన కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, కడప సెంట్రల్ జైలులో కిడ్నాపర్ల గ్యాంగ్ లీడర్ సునీల్ ఆగడాలు పెరుగుతున్నాయని అంటున్నారు. పెన్నా బ్యారెక్లో రెండు సెల్ఫోన్లు, ఛార్జర్లను జైలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.