ఇల్లు వదిలేసిన భార్య: గొంతు కోసి కూతురిని చంపిన వ్యక్తి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఓ తండ్రి అత్యంత ఘాతుకానికి పాల్పడ్డాడు. చిలకలూరిపేట మండంల లింగంగుంట్లలో మద్యం మత్తులో ఓ వ్యక్తి వికలాంగురాలైన తన కూతురిని గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
అతను తన కుమారుడిపై కూడా దాడి చేసినట్లు సమాచారం. దాడిలో కూతురు చనిపోగా, కుమారుడు తప్పించుకున్నాడు. ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన తిరుపతయ్య, అతని భార్య అనంతమ్మ గత కొంతకాలంగా లింగంగుంట్లలో నివసిస్తూ వస్తున్నారు.
వారికి ఐదుగురు పిల్లలు. శనివారం ఉదయం మద్యం సేవించి వచ్చి భార్యతో తిరుపతయ్య గొడవ పడ్డాడు. దాంతో ఆమె ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఆ కోపాన్ని తిరుపతయ్య పిల్లలపై చూపించాడు. 8 ఏళ్ల కూతురిని గొంతుకోసి చంపేసి, కొడుకుపై కూడా హత్యాయత్నం చేశాడు. దీంతో భయపడి కుమారుడు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు.
బైక్ అదుపు తప్పి ఇద్దరు మృతి
ఇదిలావుంటే, అతివేగంతో ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు మృతి చెందిన విషాదకరమైన ఘటన శనివారం కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. మైలవరం మండలం కుంటముక్కల దగ్గర బైక్ అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.