రెండెకరాల పొలం కోసమే: తల్లిని కాల్చి చంపిన తనయుడు (ఫొటోలు)
గుంటూరు: రెండు ఎకరాల పొలం కోసం, తన మాటకు విలువనివ్వడం లేదనే కోపంతో కన్నతల్లినే ఓ మాజీ సైనికుడు కడతేర్చాడు. గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని కొవ్వూరుకు చెందిన షేక్ మస్తాన్వలి తన తల్లి షేక్ ఫజూలీన్ (68)తో నిత్యం ఆస్తికోసం ఘర్షణ పడుతుండేవాడు.
ఈ క్రమంలో బుధవారం తనవద్దనున్న లైసెన్డ్డ్ డబుల్ బేరల్ తుపాకీతో కన్నతల్లిని కాల్చేశాడు. ఎడమభుజం వెనుకభాగంలో తీవ్రంగా గాయపడిన ఫజూలీన్ కొద్దిసేపటికే మృతి చెందింది. తుపాకీ పేలుడు శబ్దానికి చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకోగా ఆమె శవం కనిపించింది.
ఇటీవలనే తల్లి ఫజులీన్ నివాసముంటున్న ఇంటికి మరమ్మతులు చేయిస్తుండగా ఇద్దరు కుమార్తెలు డబ్బు ఖర్చు పెట్టవద్దని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇంటికి మరమ్మతులు చేయించాల్సిందేనని మస్తాన్వలి పట్టుబట్టాడు.
పొలం విషయంలో ఇంతవరకు తేల్చిచెప్పని తల్లి ఇంటి విషయంలో కూడా తన మాట వినడం లేదనే కోపంతో ఈ దురాగతానికి పాల్పడ్డాడు. బాపట్ల డిఎస్పి డి మహేష్ నేతృత్వంలో పొన్నూరు రూరల్ సిఐ ఎన్ చంద్రవౌళి, కాకుమాను ఎస్ఐ ఎల్ లోకేశ్వరరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు.