హైదరాబాద్ అధికారాలు ఉత్తదే: నరసింహన్ (పిక్చర్స్)
హైదరాబాద్: రెండు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల అధికారాలను గవర్నర్కు కట్టబెడతారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. కేవలం మీడియాలో అలాంటి వార్తలు వస్తున్నాయే తప్ప కేంద్రంనుంచి తనకు అలాంటి సమాచారమేది లేదని ఆయన చెప్పారు. హోంమంత్రితో తన సమావేశం మామూలుగా జరిగేదేనని, అందులో ఈ అంశంపై ఎలాంటి చర్చా జరగలేదని ఆయన స్పష్టం చేశారు.
మీడియాలో వార్తలు రాసి వివరణ అడిగితే తానేం చెప్పగలనని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్సహా రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉందని ఎలాంటి ఇబ్బందులు లేవని అయన వ్యాఖ్యానించారు. రెండురోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న గవర్నర్ నరసింహన్ ఆ వెంటనే కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్తో భేటీ అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని తాజా పరిస్థితులను, పునర్ వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన అంశాలను ఆయనతో ప్రస్తావించారు. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలోనూ హైదరాబాద్ నగరంలోనూ శాంతిభద్రతలు సంతృప్తికరంగా ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందులూ లేవని గవర్నర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో అధికారాలను గవర్నర్కే కట్టబెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు.
హైకోర్టు విభజన గురించి ప్రస్తావిస్తూ, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం వెలుగులోనే ఈ అంశం పరిష్కారమవుతుందని నరసింహన్ అన్నారు. ఇప్పటిదాకా ఈ విషయంలో ఎలాంటి వివాదమూ లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే హైకోర్టును ఏర్పాటు చేయాలని వస్తున్న డిమాండ్ గురించి ఆయన దృష్టికి తేగా ఇప్పటివరకు ఈ అంశంలో పరిష్కారం దొరకని తీరులో ఏదీ జరుగలేదు.. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అన్నారు. సమస్యలేవైనా ఉంటే చర్చల ప్రక్రియ ఉంటుందని వివరించారు. హైకోర్టు విభజన అంశంలో సంక్లిష్టత అంటూ ఏదీ తన దృష్టికి రాలేదని అన్నారు. హోం మంత్రితో జరిగిన చర్చల్లో హైకోర్టు గురించిన ప్రస్తావన రాలేదని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరుపై గవర్నర్ స్పందిస్తూ, ఈ అంశం తనకు బాధ కలిగించిందా లేదా అనేది ప్రధానం కాదన్నారు. వారిపై స్పీకర్ చర్యలు తీసుకున్నారు అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఏడాది గడిస్తే..
రాష్ర్టాల్లోనూ పరిపాలన సంతృప్తికరంగానే ఉన్నదని గవర్నర్ చెప్పారు. ఇప్పటికి ప్రభుత్వాలు ఏర్పడి పది నెలలు కూడా పూర్తి కాలేదని గవర్నర్ అన్నారు. కనీసం ఒక సంవత్సరం పూర్తయ్యేటప్పటికి గణనీయమైన ఫలితాలు వస్తాయని గవర్నర్ నరసింహన్ ఆశాభావం వ్యక్తంచేశారు. రెండు రాష్ర్టాల మధ్య తీవ్ర స్వభావంతో కూడిన విభేదాలేవీ లేవని అభిప్రాయపడ్డారు. తాను హోం మంత్రితో భేటీకావడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదని అన్నారు.
అది నా విధి..
రెండు రాష్ర్టాల్లోని పరిస్థితులను గవర్నర్గా వివరించడం తన విధి అని, అందులో భాగంగానే హోంమంత్రితో సమావేశం జరిగింది తప్ప ప్రత్యేకించి ఎలాంటి కొత్త అంశం లేదని అన్నారు. హైదరాబాద్ శాంతిభద్రతల విషయమై హోం మంత్రితో జరిగిన సమావేశంలో చర్చలుగానీ జరగలేదని చెప్పారు. అంతా ప్రశాంతంగానే ఉందిగదా అని వ్యాఖ్యానించారు.
మీడియా వద్దనే..
కొందరు విలేకర్లు మీడియాలో వార్తలు ప్రస్తావించినపుడు - వాటిని రాసిన పాత్రికేయుల దగ్గరే దానికి సంబంధించిన సమాచారం ఉంటుంది తప్ప, తన నుంచి వివరణ కోసం ప్రశ్నిస్తే తానేం చెప్పగలనని నరసింహన్ అన్నారు.
రాష్ట్రపతితో భేటీ
రాష్ట్రపతితో గవర్నర్ భేటీ: హోంమంత్రితో భేటీ అనంతరం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో నరసింహన్ భేటీ అయ్యారు. రెండు రాష్ర్టాల్లోని తాజా పరిస్థితిని వివరించారు. ఇటీవల ముగిసిన రెండు రాష్ర్టాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల గురించి, బడ్జెట్ల గురించీ వివరించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన గురించి వివరించారు.
అసెంబ్లీకి సంబంధించినంత వరకు స్పీకర్ నిర్ణయమే శిరోధార్యం.. శాసనసభకు ఆయనే సుప్రీం అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో గవర్నర్గా తాను స్పందించేదేముంటుందని ఎదురు ప్రశ్నించారు. సభా సంప్రదాయాలకు భిన్నంగా సభ్యులు వ్యవహరించినట్లయితే దానిపై చర్యలు తీసుకోవాల్సింది స్పీకరే, ఆ వ్యవహారాన్ని ఆయన చూసుకుంటారు, ఇప్పటికే చర్యలు తీసుకున్నారు అని అన్నారు.