బాబు ఊదరగొట్టారు: బస్సు యాత్రలో జగన్ ఫైర్ (పిక్చర్స్)
రాజమండ్రి: గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఊదరగొట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టిన తర్వాత పోలవరం ప్రాజెక్టు వెనక్కి పోతోందని ఆయన విమర్శించారు.
ప్రాజెక్టుల బస్సు యాత్రలో భాగంగా ఆయన బుధవారంనాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్టును ఇంతకు ముందు నాలుగేళ్లలో పూర్తి చేస్తామని, తాజాగా ఐదేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు అంటున్నారని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఎందుకు నెమ్మదించాయని ఆయన అడిగారు.
అరికరేవుల పథకంపై..
దివంగత మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ఆరికరేవుల ఎత్తిపోతల ప్రాజెక్టును మధ్యలోనే ఆపేయడం తగదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
గట్టిగా డిమాండ్
అరికరేవుల ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.
ప్రాజెక్టుల బస్సు యాత్ర
ప్రాజెక్టుల బస్సు యాత్రను ఆయన బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన ఆ ప్రాజెక్టును సందర్శించారు.
చంద్రబాబు ఆపేశారు..
ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఆపేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.
పోలవరం ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి కావాలంటే ఏడాదికి 4 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని, చంద్రబాబు ప్రభుత్వం కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన అన్నారు.
పోలవరం ప్రాజెక్టు వద్ద జగన్ సైట్ ఇంజనీర్లతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కుడిగట్టు కాలువ పనులు 70 శాతం ఇదివరకే వైయస్సార్ హయాంలోనే జరిగాయని ఆయన చెప్పారు. ఇప్పుడు ప్రాజెక్టు పనులు జరగడం లేదని ఆయన అన్నారు.