జగన్కు షాక్: అక్రమాస్తుల కేసు వేగం చేయాలని పిల్, బెంగళూరుకు సీబీఐ నో
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాక్. జగన్ అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేయాలని హైకోర్టులో సోమవారం నాడు పిల్ దాఖలైంది. విజయవాడకు చెందిన వేదవ్యాస్ అనే న్యాయవాది ఈ పిల్ దాఖలు చేశారు.
వేదవ్యాస్ వేసిన పిల్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దర్యాఫ్తు పురోగతి వివరాలు తెలపాలని హైకోర్టు సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.
జగన్, విజయసాయిరెడ్డి పిటిషన్లపై అభ్యంతరం తెలిపిన సీబీఐ
జగన్, విజయసాయిరెడ్డి పిటిషన్లపై సీబీఐ అభ్యంతరం తెలిపింది. అవసరమైనప్పుడు బెంగళూరు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ పిటిషన్ వేశారు. అదే విధంగా ఏపీ, కర్ణాటక, తమిళనాడు, దిల్లీ వెళ్లేందుకు అనుమతించాలని విజయసాయి రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ షరతులు సడలించొద్దని కోర్టును సీబీఐ కోరింది. షరతులు సడలిస్తే విచారణలో జాప్యం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.