ఏపీలోను ప్లాస్టిక్ రైస్ కలకలం: బంతిలా ఎగురుతున్న అన్నం ముద్ద!..
ఈ బియ్యంతో వండిన అన్నం తినగానే మగతగా నిద్రలోకి జారుకున్నాడు. ఆపై నీరసంగా అనిపించింది. మరోసారి అన్నం తింటున్న సమయంలో దాన్ని నేలకేసి కొట్టగా బంతిలా పైకెగిరింది.
కందుకూరు: ప్లాస్టిక్ బియ్యం కలకలంతో.. చాలామంది తమ ఇళ్లల్లో బియ్యం టెస్టులు మొదలుపెట్టేశారు. తినే అన్నం.. ప్లాస్టిక్ దా.. ఒరిజినల్ దేనా? అని తేల్చుకునేందుకు తంటాలు పడుతున్నారు. మంగళవారం నాడు హైదరాబాద్ లోని పలుచోట్ల ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపగా.. ఏపీలోని కందుకూరులోను ప్లాస్టిక్ బియ్యం అమ్ముతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కందుకూరు మండలంలోని ఓగూరు గ్రామానికి చెందిన పొటికలపూడి మాధవరావు 'మోర్' షాప్ లో 25కేజీల బియ్యం బస్తా తీసుకెళ్లాడు. వాస్తవ ధర రూ.1400 అయినప్పటికీ, రూ,900కే ఇస్తున్నామని మోర్ సిబ్బంది చెప్పడంతో మాధవరావు ఆ బియ్యాన్ని కొనుక్కెళ్లాడు. గజానన్ బ్రాండ్ కు చెందిన ఈ బియ్యంపై మాధవరావుకు అనుమానం కలిగింది.
ఈ బియ్యంతో వండిన అన్నం తినగానే మగతగా నిద్రలోకి జారుకున్నాడు. ఆపై నీరసంగా అనిపించింది. మరోసారి అన్నం తింటున్న సమయంలో దాన్ని నేలకేసి కొట్టగా బంతిలా పైకెగిరింది. నిజమైన అన్నమైతే ముద్దలుగా విడిపోవాలి కదా అన్న సందేహం కలిగింది. ఇంతలో టీవిలో వస్తున్న ప్లాస్టిక్ రైస్ గురించి వినడంతో తన అనుమానం బలపడింది. వెంటనే వండిన అన్నంతో సహా మోర్ దుకాణం వద్దకు తీసుకొచ్చాడు.
సమాచారం అందుకున్న పోలీసులు మోర్ లో తనిఖీలు చేయగా.. సిబ్బంది తమకేమి తెలియదన్నారు. ఇదే రకం బియ్యం గతంలోను విక్రయించామని, ఇప్పుడు కూడా విక్రయిస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ బియ్యం అన్న అనుమానాలు వ్యక్తమవుతుండటంతో షాపులో ఉన్న మరో 25 గజానన్ బ్రాండ్ బస్తాలను స్థానిక తహశీల్దార్ సీజ్ చేశారు. త్వరలోనే ఈ బియ్యానికి పరీక్షలు నిర్వహించి.. అసలువో నకిలీవో తేల్చనున్నారు.