7న శ్రీవారి ఆలయం మూసివేత: తెలుగు రాష్ట్రాల మీదుగా అయోధ్యకు రైలు
తిరుపతి: చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని ఆగస్టు 7న మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తెలిపింది. చంద్రగ్రహణం 7వ తేదీ రాత్రి 10.52 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 12.48 గంటలకు పూర్తి అవుతుందని వివరించింది.
దీంతో శ్రీవారి మందిరాన్ని 7న సాయంత్రం 4.30 నుంచి మరుసటి రోజు తెల్లవారు జామున 2 గంటల వరకు మూసివేయనున్నట్లు పేర్కొంది. 8న వేకువ జామున ఆలయ తలుపులు తెరచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించనున్నట్లు వివరించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల అనంతరం ఉదయం 7 గంటలకు శ్రీవారి దర్శనాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల మీదుగా అయోధ్యకు రైలు
తమిళనాడులోని రామేశ్వరం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యకు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. రామేశ్వరం- ఫైజాబాద్ (వయా అయోధ్య) వారపు రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జులై 27న వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని గూడూరు, విజయవాడ, తెలంగాణలోని వరంగల్ స్టేషన్లలో ఆగే ఈ రైలు (నెం.16793/16794) ఆగస్టు 2 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే బుధవారం ప్రకటించింది. ఈ రైలు రామేశ్వరంలో ప్రతి ఆదివారం రాత్రి 11.50కి; ఫైజాబాద్లో ప్రతి బుధవారం రాత్రి 11.55 గంటలకు బయలుదేరుతుంది.