వెంకయ్యకు బీపీ రాకుండా చూస్తాం: తొలిసారంటూ కొనియాడిన మోడీ
న్యూఢిల్లీ: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడును ప్రకటించిన నేపథ్యంలో ఆయనపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘ శాసన సంబంధ అనుభవమున్న నేత ఉపరాష్ట్రపతి పదవి చేపట్టనుండటం బహుశా ఇదే తొలిసారని అన్నారు. వెంకయ్యది గ్రామాలకు, రైతులకు అంకితమైన జీవితమని మోడీ కొనియాడారు.
తొలిసారి..
వెంకయ్య నామినేషన్కు ముందు జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోడీ ప్రసంగించారు. అనేక ప్రాంతాల్లో పనిచేసిన అనుభవమున్న నేత ఉపరాష్ట్రపతి పదవి చేపట్టడమూ ఇదే తొలిసారి కావచ్చని అన్నారు. వెంకయ్య దేశమంతా తిరిగి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారని చెప్పారు.
Recommended Video
బీపీ పెరగకుండా
కేబినెట్ సమావేశాల్లో వ్యవసాయంపై వెంకయ్య చేసే సూచనలు విధాన రూపకల్పనకు ఎంతో ఉపయోగపడ్డాయని మోడీ తెలిపారు. వెంకయ్య అభ్యర్థిత్వంపై అద్భుత స్పందన వచ్చిందని అన్నారు. మెజార్టీ నేతలు స్వాగతించారని అన్నారు. రాజ్యసభలో సభాపతిగా వ్యవహరించనున్న ఆయనకు రక్తపోటు(బీపీ) పెరగకుండా చూస్తామని హామీ ఇస్తున్నట్లు మోడీ సరదాగా వ్యాఖ్యానించారు.
బీజేపీకి నష్టమే..
ఇది ఇలా ఉండగా, వెంకయ్య ఉపరాష్ట్రపతి కావడం బీజేపీకి పూరించలేని నష్టమని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. అయితే, ఈ ప్రతిష్టాత్మక పదవికి ఇంత గొప్ప యోగ్యత గల నేత ఎంపిక కావడం హర్షనీయమని అన్నారు.
నామినేషన్ వేసిన వెంకయ్య..
మంగళవారం వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీతోపాటు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు ఆయన వెంట ఉన్నారు.