ఏం పంటలు వేశారు: తెలుగు రైతులతో మాట్లాడిన ప్రధాని మోడీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నాడు తెలుగు రాష్ట్రాల రైతులతో మాట్లాడారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన హైదరాబాదులోని రైతులతో మాట్లాడారు.
ఆయన అన్ని రాష్ట్రాల రైతులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఇందులో భాగంగా తెలుగు రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు సుజనా చౌదరి, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల ద్వారా పొందుతున్న లబ్ధి గురించి రైతులను అడిగి తెల్సుకున్నారు.
తెలుగు రాష్ట్రాలలోని రైతులతో మాట్లాడిన ప్రధాని మోడీ వారు వేసిన పంటలు, వ్యవసాయంలో అనుసరిస్తున్న నూతన పద్ధతులను అడిగి తెలుసుకున్నారు.
ఏపీలోని కర్నూలుకు చెందిన గజేందర్ అనే రైతు మాట్లాడారు. తాము గతంలో పత్తి, జొన్న, మొక్కజొన్న సాగుచేసి నష్టపోయామని, శాస్త్రవేత్తల సూచనల మేరకు ప్రస్తుతం అశ్వగంధ ఔషధ పంటను సాగుచేస్తున్నట్లు ప్రధానికి సదరు రైతు తెలిపారు.
అశ్వగంధ పంటను మధ్యప్రదేశ్లో మార్కెట్ చేస్తూ హెక్టారుకు రూ.10-15వేల వరకు లాభాలు ఆర్జిస్తున్నట్లు అతను చెప్పారు. కొత్త వంగడాలు అందిస్తే అధిక దిగుబడులు సాధిస్తామని పాడేరుకు చెందిన రైతు ప్రధానికి వివరించారు.