చంద్రబాబు చిచ్టు పెడుతున్నారు: రాందాస్
చిత్తూరు/వేలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలారు చెక్ డ్యాంలు నిర్మించి సోదర భావంతో ఉన్న తెలుగు, తమిళ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నాడని పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, ఎంపీ అన్భుమణి రాందాస్ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దులోని వేలూరు జిల్లా సమీపంలో పాలారులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెక్ డ్యాంలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. చెక్ డ్యాంల వలన వేలూరు, కాంచీపురం జిల్లాల ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కోంటారని అన్భుమణి రాందాస్ అన్నారు.
అంతే కాకుండా వేలూరు, కాంచీపురం జిల్లాల్లో వ్యవసాయం పూర్తిగా దెబ్బతింటుందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తమిళనాడులోని అన్నిపార్టీలు వ్యతిరేకత తెలుపుతున్నాయని అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ కాంచీపురం జిల్లాలో ధర్నా చేపట్టామని, ఈ ధర్నాకు కాంచీపురం, వేలూరు జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరైనారని అన్భుమణి రాందాస్ చెప్పారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చెయ్యాలని మనవి చేశారు.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు, తమిళ ప్రజలు సోదరభావంతో మెలుగుతున్నారని, చంద్రబాబు మొండి వైఖరితో ఇరు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోనే అవకాశం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో భారీగా చెక్ డ్యాంలు నిర్మించి తమిళనాడులోకి నీళ్లు రాకుండా చేస్తే లక్షలాధి మంది ప్రజలు ఇబ్బందులు పడుతారని అన్నారు. వెంటనే చెక్ డ్యాం పనులు నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా ఇప్పటికే నిర్మించిన చెక్ డ్యాంలు తొలగించాలని, అప్పుడే ఇరు రాష్ట్రాల మద్య శాంతియుత వాతావరణం ఉంటుందని అన్నారు. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేయ్యడానికి తమిళ ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్భుమణి రాందాస్ హెచ్చరించారు.