పోలవరంపై కేంద్రం ఎత్తుగడ?: మోడీ ప్లాన్ ఇదీ, ప్రత్యేకహోదా లాగే అవుతుందా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వలేమని చేతులెత్తేసిన కేంద్రం ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో కూడా అదే విధంగా మొండి చెయ్యి చూపే విధంగా పావులు కదుపుతోందని సమాచారం. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వబోవడం లేదని ఢిల్లీలో తెలుగు మీడియాకు ఓ లీకు అందినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని విభజన చట్టంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం పొందుపరిచింది. అయితే ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో పోలవరానికే కేవలం రూ. 500 కోట్లు మాత్రమే విడుదల చేసింది.
ఇదే విధంగా కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తే ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి వంద ఏళ్లు పడుతుంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో లోక్సభలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చేతులెత్తెసిన నేపథ్యంలో జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఎవరిస్తారనే ఆందోళన ప్రజల్లో మొదలైంది.
ఒకవేళ అప్పు చేసి ఈ ప్రాజెక్టు కడితే అప్పు ఎవరు తీరుస్తారు కేంద్రమా? లేక రాష్ట్ర ప్రభుత్వమా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. పోలవరానికి నిధుల విషయంలో అటు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఒకలా మాట్లాడుతుంటే, కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి మరోలా మాట్లాడుతున్నారు.
వీరిద్దరూ పరస్పరం విరుద్ధంగా మాట్లాడుతుండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై మంత్రి ఉమాభారతిని ప్రశ్నించగా "పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందువల్ల ఖర్చు, నిర్మాణ బాధ్యతా కేంద్రప్రభుత్వానిదే"నని ఆమె స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా "పోలవరం ప్రాజెక్టు బాధ్యత మనదే"నని ప్రధాని మోడీకి లేఖ రాసి ఆకాపీని ఏపీ సీఎం చంద్రబాబుకు పంపారు.
అయితే ఈ లేఖ రాష్ట్ర ప్రభుత్వానికి అందే సరికే పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని నరేంద్రమోడీ ఓ నిర్ణయం తీసుకున్నారంట. అదేంటంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో 70 శాతం మొత్తాన్ని కేంద్రప్రభుత్వం రుణంగా ఇప్పిస్తుందంట. మిగిలిన 30 శాతం నిధులను ఏపీనే సమకూర్చుకోవాలట.
అయితే ఈ ప్రతిపాదనకు అంగీకరించని చంద్రబాబు ఆ విషయాన్ని పీఎంఓకు స్పష్టం చేశారని తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేకహోదాపై గురువారం కేంద్ర ఆర్ధిక మంత్రి జైట్లీ లోక్సభలో ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఏపీకి అండగా ఉంటామని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ ఇస్తామని చెప్పారు.
అదే విధంగా పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ నుంచి రుణం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డ్ నుంచి రుణాలు మంజూరు చేయిస్తామని జైట్లీ ప్రకటించగానే ఒడిశాకు చెందిన బిజెడి ఎంపీలు లేచి తీవ్ర నిరసన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆ తర్వార వారు వాకౌట్ చేశారనుకోండి.
దీని తర్వాత పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రి ఉమాభారతి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసేందుకు ఎన్డిఏ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని హామీ ఇచ్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున దానికయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుందని ఆమె చెప్పారు.
ప్రాజెక్టు నిర్మాణం కోసం నాబార్డ్ నుంచి రుణం తీసుకుంటామని ఉమాభారతి స్పష్టం చేశారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాతనే పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు మంజూరు చేసినట్లు ఆమె గుర్తు చేశారు. విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, దాని నిర్మాణానికి అవసరమ్యే నిధులు కేంద్రమే భరించాలని ఉంది.
అయితే ఈ ప్రాజెక్టు విషయంలో కూడా ఎన్టీఏ ప్రభుత్వం సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో చిత్తశుద్ధిలో బీజేపీ వ్వవహారించడం లేని సమయంలో పోలవరం ప్రాజెక్టుపై కూడా నీలిమేఘాలు కమ్ముకుంటాయనే ఆందోళనో ప్రజలు ఉన్నారు.