పోలవరానికి రూ. 250 కోట్లు విడుదల చేసిన కేంద్రం
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు కోసం 2014-15 ఆర్ధిక సంవత్సరానికి రూ. 250 కోట్లు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినందున దీనికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంది. గతంలో ఈ ప్రాజెక్టుకు ఏఐబీబీ ద్వారా నిధులు అందుతున్నాయి.
పోలవరం ప్రాజెక్టుకు 2014-15 కేంద్ర బడ్జెట్లో రూ. 250 కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నిధులు అందలేదు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులన్నింటిని తిరిగి చెల్లిస్తామని కేంద్రం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు రూ. 322 కోట్లు ఖర్చు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చే క్రమంలో కేంద్ర ప్రభుత్వం రూ. 250 కోట్లను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది.
కేంద్రం విడుదల చేయనున్న నిధులు పోలవరం ప్రాజెక్టు అధారిటీ ద్వారా ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వానకి అందుతాయి. ఈ ప్రాజెక్టు కోసం స్పెషల్ పర్సన్ వెహికల్ (ఎస్సీవీ) ఏర్పాటు చేయాల్సి ఉంది. దీని కోసం పోలవరం ప్రాజెక్టు అధారిటీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 16,010.45 కోట్లు(2010-11 సంవత్సరం వేసిన లెక్కలు)గా ప్రభుత్వం అంచనా వేసింది. 2014 ఏప్రిల్ నుంచి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన మొత్తం రూ. 322.03 కోట్లు.