సంచలనం సృష్టించిన మెదక్ హత్యకేసు: హెడ్కానిస్టేబుల్ దంపతులు అరెస్టు
మెదక్: జిల్లాలో సంచలనం సృష్టించిన చిన్నారి బాలిక షాహిస్తా సబా హత్యకేసులో నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. చిన్నారి మరణానికి కారణమైన బొల్లారం హెడ్ కానిస్టేబుల్ జాకీర్ హుస్సేన్, అతని భార్య రజియా సుల్తానాలను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా, జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం హెడ్కానిస్టేబుల్ సయ్యద్ జాకిర్ హుస్సేన్ అహ్మద్, భార్య రజియా సుల్తానాలు కొండాపూర్ మండలం మల్కాపూర్లో నివాసముంటున్నారు. జాకీర్ హుస్సేన్ దంపతులు గత రంజాన్ పర్వదినాన కర్ణాటకలోని గుల్బర్గా దర్గా వద్దకు వెళ్లారు.
అక్కడి నుంచి సబా అనే చిన్నారిని తీసుకువచ్చి ఇంట్లో పనికి పెట్టుకున్నారు. అయితే తీసుకువచ్చినప్పటి నుంచీ ఆ బాలికపై హెడ్కానిస్టేబుల్ దంపతులు వేదిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఇంట్లో నుంచి నిరంతరం చిన్నారి ఏడుపులు, అరుపులు వినబడటంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు.
స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు జాకీర్ ఇంటిని సోదా చేయగా ఇంట్లో దాచి ఉంచిన బాలిక చేతులు, కాళ్లకు వాతలు పెట్టి, బాలికపై వేడి నూనె పోశారు. దీంతో తీవ్రంగా గాయపడిన బాలిక పరిస్థితిని గమనించిన స్థానికులు సమాచారంతో గురువారం అక్కడికి చేరుకున్న శిశు సంరక్షణ అధికారి ఎం.ఎస్.చంద్ర బాలికను సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.
అయితే అక్కడ చికిత్స పొందుతున్న షాహిస్తా సబా మృతి చెందింది. చంద్ర ఫిర్యాదు మేరకు సంగారెడ్డి పోలీసులు సయ్యద్ జాకిర్ హుస్సేన్ అహ్మద్, భార్య రజియా సుల్తానాలను శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆ దంపతులపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి, ఆ బాలిక ఎవరు, ఎందుకు తీసుకువచ్చారు అంటూ పలు కోణాలలో విచారణ జరుపుతున్నట్లు సంగారెడ్డి డీసీపీ తిరుపలి వెల్లడించారు.