మానవ హక్కుల పేరిట భూదందాలు, విలాసాలు: అరెస్ట్
హైదరాబాద్: మానవ హక్కుల పేరిట భూదందాలు, భార్యాభర్తల తగాదాలు, సెటిల్మెంట్లు చేస్తూ తన నివాసాన్నే ప్రజాదర్బార్గా చేసిన ఓ వ్యక్తిని బాలానగర్ డిసిపి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మెదక్ జిల్లా జోగిపేటకు చెందిన సాదత్ అహ్మద్ కొంతకాలంగా కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారం కాలనీ సాయిబాబానగర్లో నివాసం ఉంటున్నాడు.
అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం క్రితం నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సంస్థను స్థాపించాడు. భూదందాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, భార్యాభర్తల తగాదాలు అంశాలపై దర్బార్ నిర్వహిస్తుండేవాడని సమాచారం. అతని బారిన పడిన బాధితులు కొందరు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించగా బాలానగర్ పోలీసులు ప్రత్యేక నిఘా టీమ్ను ఏర్పాటు చేసి రెండు నెలలుగా దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు సేకరించారు. దీంతో అసలు విషయం బయటపడింది.
పోలీసుల నిఘాను పసిగట్టిన సాదత్ కొన్ని రోజులుగా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సాదత్ను స్పెషల్ పోలీసు బృందం ఇటీవల అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సాదత్ నివాసంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
సాదత్ ఇంట్లో జరిగిన తనిఖీల్లో పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి. ఆయన ఇంట్లో అడుగడుగునా సెక్యూరిటీ ఉంది. అధునాతన ఫర్నీచర్, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, దర్బారు వేదిక ఉండటం, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తలదన్నేతీరిలో హంగులు, ఆర్భాటాలు ఉండటంతో పోలీసులు తెల్లబోయారు.
తనిఖీల్లో కీలకమైన పత్రాలు, రెండు కార్లు, ఓ ద్విచక్ర వాహనం, సిమ్ కార్డులు, వాహనాల నెంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు. సాదత్పై సంగారెడ్డి, జోగిపేట్, తూప్రాన్, దుండిగల్, జీడిమెట్ల పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయి. కాగా, నేడో రేపో ఆయనను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది.
2006 నుంచి దందా మొదలు
మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన సాదత్ 2001 నగరానికి వచ్చాడు. కుత్బుల్లాపూర్ సర్కిల్ గాజులరామారం డివిజన్ పరిధిలోని చంద్రగిరినగర్లో నివాసముంటున్న తన బావ వద్ద ఉండేవాడు. అప్పటినుంచి ప్రభుత్వ స్థలాల్లో జోక్యం చేసుకుంటూ భూకబ్జాలకు పాల్పడేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో 2006లో అంతర్జాతీయ మానవ హక్కుల సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా తెరపైకి వచ్చాడు. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా తనకు తానే ప్రకటించుకొని వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి.