పోలీసుల కూంబింగ్ ... రెచ్చిపోయిన స్మగ్లర్లు ... ఏం చేశారంటే...
చిత్తూరు జిల్లా శేషాచలం అడవిలో ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. శ్రీవారి మెట్టు నుంచి ఎస్వీ జూపార్క్ లో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులపై రాళ్ళ దాడికి తెగబడ్డారు.
తిరుపతి: చిత్తూరు జిల్లా శేషాచలం అడవిలో ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. శ్రీవారి మెట్టు నుంచి ఎస్వీ జూపార్క్ లో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులపై రాళ్ళ దాడికి తెగబడ్డారు.
ఆదివారం తెల్లవారుజామున జూపార్క్ లోని నల్లగుట్ట సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆరెస్సై వాసు టీంకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్ల గుంపు ఎదురుపడింది. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, స్మగ్లర్లు పోలీసులపై రాళ్ళతో దాడి చేశారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. మూడు గుంపులుగా మొత్తం 70 మంది తమిళ స్మగ్లర్లు పోలీసులపైకి రాళ్ళు విసిరారు. దట్టమైన పొగమంచులో.. స్మగ్లర్ల దాడిని ఎదుర్కొనేందుకు మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు ఎస్ఐ వాసు పేర్కొన్నారు.
రాళ్ళు విసురుతూ పారిపోతున్న వారిలో తమిళనాడులోని జావాదిమలైకి చెందిన విజయకుమార్, మణి అనే స్మగ్లర్లు పోలీసులకు దొరికిపోయారు. సంఘటన స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్న 55 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని, కూబింగ్ ఇంకా కొనసాగుతోందని ఎస్ఐ వాసు తెలిపారు.