సిఐ భార్య అనుమానాస్పద మృతి కేసులో పురోగతి
అనంతపురం: కడప సిఐ భార్య పద్మలత అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం అవరావాండ్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించినట్లు కట్టుకథ అల్లినట్లు ఆరోపణలు వచ్చాయి. తన భార్య పద్మలతను కడప సిఐ అర్జున్ నాయక్ పక్కా పథకం ప్రకారం హతమార్చినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు దర్యాప్తు సాగించారు. ఇందులో వారు పురోగతి సాధించారు.
పద్మలత మృతిపై అర్జున్ నాయక్ సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వారిపై 490, 302 సెక్షన్ల కింద కేసు పెట్టినట్లు చెబుతున్నారు సిఐ అర్జున్ నాయక్, అతని భార్య పద్మలత మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు. తమ వ్యవసాయ పొలంలోని కందిపంటును గ్రామ సమీపంలోనే నూర్పిడి చేసి, దాని కాపలా కోసం రోడ్డు పక్కన భార్యాభర్తలు నిద్రించారు.
అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వాహనం వారిపైకి దూసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. పద్మలతను నల్లమాడ ఆస్పత్రిలో చేర్పించగా, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. గాయపడిన అర్జున్ నాయక్ను కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమ కూతురును భర్తే హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని పద్మలత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆర్జున్ నాయక్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. పిల్లలు కూడా తండ్రిపై అనుమానం వ్యక్తం చేశారు. నల్లమాడ పోలీసులు డ్రైవర్ను, పని మనిషిని విచారిస్తున్నారు. అర్జున్ నాయక్ బంధువులను కొందరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.