నీతూ ఆగర్వాల్, ఆమె మొదటి భర్తపై గురి: ముగ్గురు నేతలపై ఆరా?
కర్నూలు: మస్తాన్వలి, అతని భార్యగా చెప్పుకుంటున్న సినీ నటి నీతూ అగర్వాల్, ఆమె మొదటి భర్త, మరో వ్యక్తిని విచారించేందుకు పోలీసులు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కోర్టును పోలీసులు కోరనున్నారు. కోర్టు అంగీకరిస్తే వారిని విచారిస్తామని వారి వద్ద స్మగ్లర్లు, వారి సహాయకులకు సంబంధించిన కీలక సమాచారం ఉందని అధికారులు అంటున్నారు. వారి నుంచి రాజకీయ నేతల పాత్రపై సమాచారం రాబట్టే ఉద్దేశంతో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఎర్రచందనం స్మగ్లింగ్లో రాయలసీమకు చెందిన ముగ్గురు నాయకుల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. సీమలోని చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలకు చెందిన ముగ్గురు నేతలు తమ బినామీల ద్వారా ఎర్రచందనాన్ని ఎల్లలు దాటిస్తున్నట్లు తెలుస్తోంది. కోల్కతాలో ఓ బినామీ కంపెనీని స్థాపించిన వీరు రాష్ట్రం నుంచి ఎర్రచందనాన్ని విడతలు విడతలుగా అక్కడికి తరలించి నిల్వ చేసినట్లు సమాచారం.
ఇటీవల పోలీసులకు చిక్కిన కర్నూలు జిల్లాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్వలీ ఇచ్చిన కీలక సమాచారం మేరకు ముగ్గురు నేతలు స్మగ్లింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. పూర్థిస్థాయి ఆధారాల కోసం మరింత లోతుగా అన్వేషిస్తున్నట్లు సమాచారం.
శేషాచలం అడవిలో పూర్తి స్థాయిలో, నల్లమల అడవుల్లో కొంత మేర విస్తారంగా పెరిగిన ఎర్రచందనం వృక్షాలను నరికి తమ సంపదను పెంచుకుంటున్న స్మగ్లర్లకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న నేతలపై పోలీసులు దృష్టి సారించారు.
తాజాగా పోలీసులకు చిక్కిన చిత్తూరు జిల్లాకు చెందిన స్మగ్లర్ సౌందరరాజన్, కర్నూలు జిల్లాకు చెందిన మస్తాన్వలితోపాటు పలువురు ద్వితీయశ్రేణి స్మగ్లర్లు పోలీసులకు కీలక సమాచారం ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. వారిచ్చిన ఆధారాలతో స్మగ్లింగ్ వ్యవహారంలో సంబంధం ఉన్న వారి బ్యాంకు ఖాతాలు, సెల్ఫోన్ కాలింగ్ జాబితా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మారిషస్ కోర్టు అధీనంలో ఉన్న కొల్లం గంగిరెడ్డిని కర్నూలుకు రప్పించి విచారిస్తే మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.
కస్టడీకి అప్పగించండి
ఎర్రచందనం అక్రమ రవాణాలో అరెస్టైన నీతు అగర్వాల్ను తమ కస్టడీకి అప్పగించాలని ఆళ్లగడ్డ కోర్టులో పోలీసులు మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఆమెను విచారిస్తే కీలక సమాచారం బయటకు వస్తుందని వారు చెబుతున్నారు.