అర్థరాత్రి తలుపులు తట్టి?: శిల్పాకు షాక్.. వాళ్ల సంగతేంటని వైసీపీ ప్రశ్న
అర్థరాత్రి తలుపులు కొట్టి సోదాలు నిర్వహించడాన్ని వారు తప్పుపట్టారు.
నంద్యాల: నంద్యాల ఉపఎన్నికకు ఇంకా మూడు రోజులే సమయం ఉండటంతో ఓటు మేనేజ్మెంట్పై ఇరు పార్టీలు ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. ఇదే క్రమంలో పోలీసులు, అధికారుల తనిఖీలు కూడా పెరిగిపోయాయి. తాజాగా వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి బంధువల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేశారు.
శిల్పా బంధువులు జగదీశ్వర్ రెడ్డి, ఆదిరెడ్డి ఇళ్లలో, ఆయన మద్దతుదారులు ఆర్య వైశ్య నాయకుడు నెరవేటి సత్యనారాయణ, లింగారెడ్డి ఇళ్లలోను సోదాలు నిర్వహించారు. పోలీసుల చర్యపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ తమపై కక్ష సాధిస్తోందని ఆరోపిస్తున్నారు. అర్థరాత్రి తలుపులు కొట్టి సోదాలు నిర్వహించడాన్ని వారు తప్పుపట్టారు.
ఎన్నికలు దగ్గరపడే కొద్ది వైసీపీకి టీడీపీ నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార టీడీపీ వందల కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నా పోలీసులు పట్టించుకోరా? అని వారు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల పక్షపాత వైఖరి ప్రజాస్వామ్యానికి చేటు అన్నారు.
సీఎం చంద్రబాబు కనుసన్నుల్లోనే వేధింపుల పర్వం కొనసాగుతోందని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వైసీపీని గురిచేస్తున్న వేధింపులకు ప్రజలే తగిన పాఠం చెబుతారని పేర్కొన్నారు. టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా నంద్యాలలో వైసీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
శిల్పాకు కలెక్టర్ నోటీసులు:
వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డికి కలెక్టర్ ఎస్. సత్యనారాయణ నోటీసులు జారీ చేశారు. 'మోసం చేయడంలో డిగ్రీ చేశారు?' అని సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంతో పాటు మరో ఆర్టికల్ను పెయిడ్ ఆర్టికల్గా ఎందుకు పరిగణించకూడదు? అన్న అంశంపై 24గంటల్లో వివరణ ఇవ్వాలని శుక్రవారం కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.