నారా లోకేష్ పిఎనంటూ టోకరా: రూ.కొటి సిద్ధం చేసుకున్న మహిళా ఎమ్మెల్యే
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిఎ విజయ్నంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి తిరుపతి శాసనసభ్యురాలు సుగుణమ్మకు టోకరా ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ పేరుతో అతను సుగుణమ్మకు ఫోన్ చేశాడు.
తనకు చెందిన వ్యక్తులు వస్తారని, వారికి కోటి రూపాయలు ఇచ్చి పంపించాలని ఆ ఆగంతకుడు ఎమ్మెల్యేతో చెప్పినట్లు సమాచారం. అందుకు అతను చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పేరును కూడా వాడుకున్నట్లు తెలుస్తోంది.
దాంతో అప్రమత్తమైన సుగుణమ్మ, ఆమె అల్లుడు సంజయ్ హైదరాబాదులోని పార్టీ కార్యాలయానికి ఫోన్ చేసి ఆరా తీశారు. ఆ పేరుగల వ్యక్తి ఎవరూ లేరని అక్కడి నుంచి సమాచారం వచ్చింది. వెంటనే ఎస్పీ గోపినాథ్ జెట్టీకి ఫోన్ చేసి చెప్పారు. ఇంతలో మళ్లీ విజయన్ పేరుతో ఫోన్ కాల్ రావడంతో డబ్బులు ఇస్తామని చెప్పి సుగుణమ్మ చెప్పినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పశ్చిమ పోలీసులు సుగుణమ్మ ఇంటి వద్ద మాటు వేసి రెక్కీ నిర్వహిచారు. ఇంతలో శ్రీకాళహస్తికి చెందిన ఓ వ్యక్తితో పాటు ఓ మహిళ, మరో ఇద్దరు వ్యక్తులు సుగుణమ్మ ఇంటికి వచ్చారు. నగదు సంచులు వారికి ఇస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. వారు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకుని, నిందితులను అర్బన్ ఎస్పీ కార్యాలయానికి తరలించారు.