భూములివ్వని రైతులకు విద్యుత్ కట్, ఆందోళనలో జగన్ కుటుంబం, షర్మిల రాక
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సెజ్లో భూములు ఇవ్వని రైతులకు అధికారులు విద్యుత్ కనెక్షన్లు కట్ చేశారు. దీంతో, రైతులు పిఠాపురం ఉప్పాడ సెంటర్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. రైతులు మాట్లాడుతూ.. సెజ్కు భూములు ఇవ్వని రైతుల పైన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. బెదిరింపు ధోరణులకు పాల్పడటమేంటన్నారు. నేడు విద్యుత్ కనెక్షన్లు కట్ చేయించిన ప్రభుత్వం రేపు తమనేం చేస్తుందో అన్నారు.
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం: బైరెడ్డి
రైతులకు న్యాయం జరిగే పోరాటం ఆగదని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. ఈ నెల 15వ తేదీన జరిగే రైతు బతుకు దెరువు యాత్రకు మద్దతివ్వాలని కోరుతూ కర్నూలు డిసిసి అధ్యక్షులు రామయ్యను ఆయన సోమవారం కలిశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. పరిశ్రమల పరుతో ప్రభుత్వం రైతలు భూములను లాక్కుంటోందన్నారు. దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.
జగన్కు ఏమైనా అయితే రాష్ట్రం అగ్నిగుండం: లక్ష్మీ పార్వతి
వైయస్ జగన్కు ఏమైనా అయితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని వైసిపి నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. ప్రభుత్వం కుప్పకూలినా తమకు సంబంధం లేదన్నారు.
కనీసం సూది కూడా వేయలేని మంత్రి కామినేని, అగ్రిగోల్డ్ భూములను తన భార్య పేరిట రాసుకున్న మంత్రి పత్తిపాటి, భోగాపురంలో ప్రజల భూములు గంటా, ఆయన తమ్ముడు అన్యాయంగా లాక్కున్నారని, ఇలాంటి వారికి జగన్ను విమర్శించే హక్కు లేదన్నారు. మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
క్షీణిస్తున్న జగన్ ఆరోగ్యం, ఆందోళన
ఏపీకి ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్న వైయస్ జగన్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నుంచి విజయమ్మ గుంటూరు బయలుదేరారు. జగన్ సోదరి షర్మిల బెంగళూరు నుంచి బయలుదేరారు.