2019లో టిక్కెట్లకు 'ప్రశాంత్కిషోర్' సర్వే కీలకం, వైసీపీ నేతల్లో గుబులు
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్కిషోర్ నిర్వహిస్తున్న రహస్య సర్వేలు వైసీపీ నేతల్లో కొత్త భయాలకు కారణమౌతున్నాయి.
అమరావతి: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్కిషోర్ నిర్వహిస్తున్న రహస్య సర్వేలు వైసీపీ నేతల్లో కొత్త భయాలకు కారణమౌతున్నాయి. మండలస్థాయి నేతలతో పీకే బృందం నిర్వహిస్తున్న సమావేశాల సందర్భంగా పార్టీ నేతల్లో నెలకొన్న విబేధాలు బహిర్గతమౌతున్నాయి.
2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకుగాను వైసీపీ ప్లాన్ చేస్తోంది.ఇందు కోసం ప్రశాంత్కిషోర్ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకొంది.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ప్రత్యర్థుల బలాలు, బలహీనతలు ఏమిటీ, వైసీపీ నేతల బలాలు ఏమిటీ, ఎక్కడ పార్టీ బలహీనంగా ఉంది., మరెక్కడ బలంగా ఉందనే అంశాలతోపాటు అన్ని అంశాలై ప్రశాంత్కిషోర్ బృందం సర్వే నిర్వహిస్తోంది.
అయితే ఈ సర్వే సందర్భంగా పలు అంశాలు వెలుగుచూస్తున్నాయి. పార్టీ నేతల మధ్య నెలకొన్న సమన్వయలోపాలు బయటకు వస్తున్నాయి. ఈ సర్వేలు కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతున్నాయనే ఆందోళనలో వైసీపీ నేతలు ఉన్నారు.
అభ్యర్థుల ఎంపిక కోసం సర్వేలు
2019 ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకుగాను వైసీపీ పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది.ఈ మేరకు ప్రశాంత్కిషోర్ నేతృత్వంలోని బృందం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహిస్తోంది.ఈ సర్వే ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ సీనియర్లు అభిప్రాయంతో ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలతో పాటు పార్టీ బలబలాలపై ప్రశాంత్కిషోర్ సర్వే నివేదికలను తేటతెల్లం చేయనుంది. ఈ నివేదిక ఆధారంగానే అభ్యర్థులకు టిక్కెట్లను కేటాయించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
Recommended Video
నేతల మధ్య సమన్వయలోపాలు
ప్రశాంత్కిషోర్ బృందం ఆయా నియోజకవర్గాల్లో సర్వే నిర్వహణకు సంబంధించి వెళ్ళిన సమయంలో పార్టీ ఇంచార్జ్లకు , మండలస్థాయి నేతలకు మధ్య సమన్వయలోపాలు బయటపడుతున్నాయి. గుంటూరు జిల్లాలో పీకే బృందం పర్యటించిన సమయంలో ఈ విషయాలు వెలుగుచూశాయి. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో పీకే బృందం పర్యటించిన సమయంలో మండలస్థాయి నేతల మధ్య నెలకొన్న సమన్వయలోపాలు బట్టబయలయ్యాయని ప్రచారం సాగుతోంది.
నేతల ప్రయత్నాలు
ప్రశాంత్కిషోర్ బృందం నివేదికలే 2019 ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుకు అనుకూలంగా మారే అవకాశం ఉన్నందున ఈ బృందాన్ని తమకు అనుకూలంగా నివేదికలు ఇవ్వాలని కొందరు నేతలు ప్రయత్నాలను ప్రారంభించారనే ప్రచారం కూడ లేకపోలేదు. నేతల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలు, సమన్వయలోపాలను పెద్దవిగా చూడకూడదని ఈ బృందాన్ని కోరుతున్నారని సమాచారం.అంతేకాదు నివేదిక బ్యాలెన్స్ ఉండేలా కొందరు నేతలు జాగ్రత్తలు తీసుకొంటున్నారని తెలుస్తోంది.
నియోజకవర్గాల సమన్వయకర్తలతో జగన్ సమావేశం
త్వరలోనే రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన పార్టీ సమన్వయకర్తలతో వైసీపీ చీఫ్ జగన్ సమావేశం కానున్నారు.ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్కిషోర్ కూడ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం లేకపోలేదు.