జగన్ వర్సెస్ పత్తిపాటి: రాజీనామాకు సిద్ధమని సవాల్, ఆవేశంతో ఊగిపోయిన బాబు
అగ్రిగోల్డ్ కేసుపై సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి.. మంత్రి పత్తిపాటి పుల్లారావుపై చేసిన ఆరోపణలో సభలో గందరగోళానికి తెరతీశాయి.
అమరావతి: అగ్రిగోల్డ్ కేసుపై సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి.. మంత్రి పత్తిపాటి పుల్లారావుపై చేసిన ఆరోపణలో సభలో గందరగోళానికి తెరతీశాయి. పలువురు మంత్రులు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయకుంటే రాజీనామా చేయాలంటూ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు.
అగ్రిగోల్డ్ బాధితుల జాబితాను ఆన్ లైన్లో పెట్టాలని జగన్ డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ నిందితుల్లో ఒకరైన సీతారాంను ఎందుకు అరెస్ట్ చేయలేదని జగన్ ప్రశ్నించారు. మంత్రి పత్తిపాటి పుల్లరావు భార్య కూడా అగ్రిగోల్డ్కు సంబంధించిన భూములను కొనుగోలు చేశారని జగన్ ఆరోపించారు. అగ్రిగోల్డ్ కేసులో మంత్రి పుల్లారావుపై ఆరోపణలు చేసిన జగన్.. దీనిపై జూడిషియల్ విచారణ చేపట్టాలని జగన్ డిమాండ్ చేశారు.
మంత్రి పుల్లారావు సవాల్
జగన్మోహన్ రెడ్డివి అన్నీ అసత్య ఆరోపణలని మంత్రి పుల్లరావు అన్నారు. గతంలో ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేస్తే జగన్ పారిపోయారని అన్నారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని.. లేదంటే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తనపై బురద జల్లితే అది జగన్మోన్ రెడ్డిపైనే పడుతుందని అన్నారు.
ధ్వజమెత్తిన అచ్చెన్నాయుడు
జగన్మోహన్ రెడ్డికి బురద జల్లడం అలవాటైపోయిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. హైదరాబాద్ శాసనసభలో కూడా ఆరోపణలు చేశారని, అప్పుడు కూడా మంత్రి పుల్లారావు సవాల్ చేస్తే స్పందించలేదని జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. జగన్ ఆరోపణలు తప్పయితే జగన్ శాశ్వతంగా రాకూడదని అన్నారు. ఆరోపణలు రుజువు చేస్తే మంత్రి రాజీనామా చేస్తారని అన్నారు.
తప్పించుకుంటున్నారు: యనమల
ఆరోపణలు చేసి సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డిపై మంత్రి యనమల ధ్వజమెత్తారు. ఆధారాల్లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారంటూ జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. ఆరోపణలు నిరూపించుకోకపోతే సభలో జగన్ ఉండకూడదని అన్నారు.
దమ్మూ, ధైర్యం ఉందా: విష్ణుకుమార్ రాజు
హౌజ్ కమిటీకి అంగీకరించే ధైర్యం ఉందా? అని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు నిలదీశారు. అబద్ధపు కథనాలను ప్రచురితం చేస్తున్న సాక్షి పత్రిక, ఛానల్పై చర్యలు తీసుకోవాలని అన్నారు. మంత్రి పుల్లారావుపై చేసిన ఆరోపణలను నిరూపించుకోవాలని జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. దమ్మూ, ధైర్యం ఉంటే మంత్రి విసిరిన సవాల్ను స్వీకరించాలని అన్నారు. ఆరోపణలు చేసి పారిపోతున్నారంటూ మరో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.
ఆవేశంగా ఊగిపోయిన చంద్రబాబు
గతంలో మంత్రి పుల్లారావు విసిరిన సవాల్కు జగన్మోహన్ రెడ్డి స్పందించలేదని, మళ్లీ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. జగన్ డిమాండ్ చేసినట్లు జూడిషియల్ ఎంక్వైరీ వేస్తామని.. జగన్ చేసిన ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పుల్లారావును సభకు రాకూండా చేస్తామన్నారు. లేదంటే జగన్మోహన్ రెడ్డిని సభ నుంచి బహిష్కరిస్తామని అన్నారు. ఇందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమేనా? అని చంద్రబాబు ఆవేశంగా మాట్లాడారు. ఈ క్రమంలో స్పీకర్ సభను 10నిమిషాలపాటు వాయిదా వేశారు.