టీఆర్ఎస్ మౌనం, టీడీపీ దూకుడు: 'గొడవ'పై రాష్ట్రపతి పంచ్ ఎవరికి?
రెండు రోజుల క్రితం తెలుగు రాష్ట్రాలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రపతి ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారనే ఆసక్తికరమైన చర్చ సాగుతోందనే చెప్పవచ్చు.
ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆపాదిస్తోంది. కేసీఆర్ను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారని అభిప్రాయపడుతోంది.
శనివారం నాడు తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ మాట్లాడుతూ.. రాష్ట్రపతి సూచన తర్వాతనైనా కెసిఆర్ అభివృద్ధి పైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కూడా మాట్లాడారు. కెసిఆర్ కావాలనే గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారని, రాష్ట్రపతి వ్యాఖ్యలు దీనికి నిదర్శనమన్నారు.
మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు రాసిన ఉనికి పుస్తకాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి, గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కెసిఆర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి పరోక్షంగా తెలుగు రాష్ట్రాల గొడవపై స్పందించారు.
గొడవలు అభివృద్ధికి ఆటంకమని, ఇరు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కెసిఆర్ అదే కార్యక్రమంలో ఉండటం గమనార్హం. దీంతో, టీడీపీ నేతలు కెసిఆర్ను ఉద్దేశించే వ్యాఖ్యానించారని చెబుతున్నారు. ఇంకోవైపు, రాష్ట్రపతి వ్యాఖ్యలను టీడీపీ కెసిఆర్కు ఆపాదిస్తుండగా, టిఆర్ఎస్ మౌనం మౌనం వహిస్తుండటం గమనార్హం.