రాష్ట్రపతి వాహనానికి తప్పిన ముప్పు: ఆలయాల్లో ప్రత్యేక పూజలు
తిరుపతి: తిరుచానూరు అమ్మవారిని దర్శించుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వాహన శ్రేణిలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్లోని రాష్ట్రపతి వాహనానికి ముప్పు తప్పింది.
రాష్ట్రపతి వాహన శ్రేణి తిరుమలకు వెళ్తుండగా అలిపిరి వద్ద కాన్వాయ్లోని వాహనం రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, వెంటనే ఢీకొన్న వాహనాన్ని పోలీసులు క్రేన్తో తొలగించారు. అనంతరం కాన్వాయ్ వెళ్లిపోయింది. దక్షిణ భారత దేశ పర్యటన కోసం సోమవారం రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ హైదరాబాద్ నగరానికి వచ్చిన విషయం తెలిసిందే.
ఆలయాల్లో ప్రణబ్ ప్రత్యేక పూజలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరుపతిలోని పలు దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో టిటిడి అధికారులు తిరుమలలో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. 1.15 గంటలకు రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు.
అంతకుముందు ప్రణబ్ కపిలేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం నవగ్రహ పూజలో పాల్గొన్నారు. రాష్ట్రపతి ప్రణబ్కు టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజులు స్వాగతం పలికారు. వరాహస్వామిని దర్శించుకున్న అనంతరం రాష్ట్రపతి శ్రీవారి ఆలయానికి వచ్చారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ నర్సింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారు.