చిక్కులు: బాబుకు ప్రత్యేక హోదా, కెసిఆర్కు రాజయ్య బర్తరఫ్
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కష్టాలు ప్రారంభమైనట్లే కనిపిస్తోంది. ప్రతిపక్షాలకు తగిన అస్త్రాలు అందడంతో వారు చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా లభించే విషయంలో అనుమానాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చిక్కులు తెచ్చే పెట్టే అవకాశాలుండగా, మంత్రివర్గం నుంచి టి. రాజయ్య బర్తరఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు సమస్యను తెచ్చిపెడుతోంది.
అవినీతి ఆరోపణలు వచ్చాయనే కారణంతో కెసిఆర్ బయటకు ఏ మాత్రం సంకేతాలు కూడా రాకుండా జాగ్రత్త పడి రాజయ్యను మంత్రి వర్గం నుంచి తొలగించారు. ఉప ముఖ్యమంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను స్వీకరించిన రాజయ్య పదవి ఎక్కువ కాలం నిలువలేదు. రాజయ్య బర్తరఫ్తో ప్రతిపక్షాలకు కెసిఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి అస్త్రం లభించింది. రాజయ్య మాదిగ వర్గానికి చెందిన దళిత నేత కావడం కూడా కెసిఆర్కు కాస్తా ఇబ్బంది కలిగించే విషయంగా మారింది.
తెలంగాణ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు రాజయ్య బర్తరఫ్ను తప్పు పడుతున్నాయి. రాజయ్య చేసిన పొరపాట్లను తాము సమర్థించడం లేదంటూనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెచ్చరిల్లిందనే వ్యాఖ్యలు కూడా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. అవినీతి బురద నుంచి దృష్టి మళ్లించడానికే కెసిఆర్ రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించారని విమర్శిస్తున్నాయి. కాంగ్రెసు పార్టీకి చెందిన మల్లుభట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు వంటి నాయకులు కెసిఆర్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాగా, చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడం పెద్ద సమస్యగానే మారింది. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా వెల్లడించడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి విమర్శలు ప్రారంభమయ్యాయి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదాను చంద్రబాబు సాధించలేకపోయారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మైసురా రెడ్డి తదితరులు విమర్సించారు. అదే సమయంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చంద్రబాబు చెప్పడం కూడా సమస్యగానే మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం అనుమానమేనని చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులతో అన్నారు. అంతకు ముందే, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు కూడా ఆ అనుమానాలను రేకెత్తించాయి. ఇరువురు నేతల ప్రకటనలతో ఎపికి ప్రత్యేక హోదా లభించడం ఉత్తదేనని తేలిపోయిందని అంటున్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, కేంద్రం నుంచి సాయం అందకపోతే కష్టమేనని చంద్రబాబు అన్నారు. ఈ స్థితిలో చంద్రబాబు ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి మరింతగా విమర్శలు ఎదుర్కునే అవకాశం ఉంది.