జగన్ చెబుతుంటారు, అందుకే రాచమల్లు చెప్పుతో కొట్టుకున్నారు: ఆది
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఎవరినీ ఏమీ అనలేక తన చెప్పుతో తానే కొట్టుకున్నాడని మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వివాదం కొనస
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఎవరినీ ఏమీ అనలేక తన చెప్పుతో తానే కొట్టుకున్నాడని మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ప్రొద్దుటూరులో అసలేం జరుగుతోంది?
ఆదివారం కూడా రగడ జరిగింది. దీనిపై ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల్లో వైసిపికి సంఖ్యాబలం లేదని తెలిపారు. 22 మంది టిడిపి కౌన్సెలర్లు నేరుగా గెలిచారని, 9 మంది వైసిపి నుంచి వచ్చారని, దీంతో టిడిపికి మొత్తం 31 మంది కౌన్సెలర్లు ఉన్నారన్నారు.
ఒప్పందం ప్రకారం రఘురామిరెడ్డిదే పదవి
మిగిలిన 18 మంది వైసిపికి ఉన్నారని, అయితే తమకు 26 మంది కౌన్సెలర్లు ఉన్నారని ఆ పార్టీ అనడం తగదని ఆదినారాయణ వ్యాఖ్యానించారు. ఒప్పందం ప్రకారం రఘురామి రెడ్డి ఛైర్మన్గా ఎన్నికవుతారని చెప్పారు. వైసిపి ఈ పదవిని అక్రమంగా దక్కించుకోవాలని చూస్తోందన్నారు.
వైసిపి కుట్ర
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో టిడిపికి స్పష్టమైన ఆధిక్యత ఉండగా, తక్కువ కౌన్సిలర్లు ఉన్న వైసీపీ చైర్మన్ పదవి దక్కించుకోవాలని కుట్ర పన్నిందని ఆరోపించారు. రెండు రోజులుగా జరిగిన సంఘటనలు ఆ పార్టీ కుట్రపై జరిగిన తిరుగుబాటుగా అభివర్ణించారు.
ఒప్పందం
వైసీపీ అప్రజాస్వామిక ఎత్తులు వేసి చివరకు చిత్తయిందన్నారు. చైర్మన్ పదవిలో గురివిరెడ్డి, ఆసం రఘు చెరో రెండున్నరేళ్లు ఉండేలా గతంలో ఒప్పందం కుదిరిందన్నారు. అందులో భాగంగా గురివిరెడ్డి రాజీనామా చేయడంతో ఆసం రఘు చైర్మన్ కావాల్సి ఉందన్నారు.
వైసిపి ఎమ్మెల్యే నిర్బంధించినందునే తిరుగుబాటు
ఎమ్మెల్యే రాచమల్లు టీడీపీ కౌన్సిలర్లను నిర్భంధించినందుకే తిరుగుబాటు వచ్చిందన్నారు. వాస్తవాలు గ్రహించిన అధికారులు ఎన్నికను వాయిదా వేశారని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిక్కచ్చిగా విధులు నిర్వహించారన్నారు.
చెప్పుతో కొట్టాలంటూ జగన్ అంటూ ఉంటారని, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆ విషయాన్ని తనకు అన్వయించుకుని తన చెప్పుతో తానే కొట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
టిడిపిలో వైసిపి చిచ్చు
కాగా, మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి వర్గీయుడు ఆసం రఘుకు ఒప్పందం ప్రకారం పదవి దక్కాలి. కానీ వైసిపి మద్దతుతో టిడిపిలోని మరో వర్గం.. ప్రతిపక్షం నుంచి టిడిపిలోకి వచ్చిన ముక్తియార్ను గెలిపించాలని చూస్తోంది. దీంతో రగడ చోటు చేసుకున్న విషయం తెలిసిందే.