వాసు హత్య కేసు: సిసి కెమెరాకు చిక్కిన నిందితులు
కృష్ణా: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వ్యాపారి బొగ్గవరపు శ్రీశైల వాసు(42) హత్య కేసులో బుధవారం పురోగతి కనిపించింది. ఈ హత్య కేసులో అనుమానితులు హనుమంతరావు, ఖాజా పాషాకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.
ఘటన జరిగిన ప్రాంతంలోని ఓ మెడికల్ షాపులో ఉంచిన సీసీ కెమెరాలో రికార్డయిన ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు శ్రీశైలవాసు ట్రాక్టర్ షోరూంలోకి వెళుతున్న దృశ్యాలు ఇందులో రికార్డయ్యాయి. పాషానే కాల్పులు జరిపివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితులను రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. నందిగామలోని తన ట్రాక్టర్ షోరూంలో ఉన్న శ్రీశైలవాసును నిందితులు మంగళవారం ఉదయం తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. అతని దగ్గరి బంధువు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నం హనుమంతురావు వద్ద పెద్ద మొత్తంలో సొమ్ము అప్పుగా తీసుకున్నాడని, ఈ బాకీ విషయమై వారి మధ్య వివాదం ఏర్పడినట్టు పోలీసులు చెబుతున్నారు.
సింగపూర్లో పనిచేస్తున్న హనుమంతురావు స్వదేశానికి వచ్చి ఐదు నెలల నుంచి నందిగామలోని శ్రీశైలవాసుకు చెందిన గెస్ట్హౌస్లోనే ఉంటున్నారు. మంగళవారం ఉదయం పది గంటల సమయంలో ఆయన తన స్నేహితుడంటూ ఖాజా పాషాను శ్రీశైలవాసు షోరూమ్కు వెంట తీసుకువచ్చారు.
శ్రీశైలవాసు తలపై పలు రౌండ్లు కాల్పులు జరిపి, మోటారు సైకిల్పై పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న శ్రీశైలవాసును అనుచరులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.