జూట్మిల్లు లాకౌట్: సీఈఓను నిర్భందించిన కార్మికులు, ఆందోళన
విజయనగరం: లాకౌట్ ఎత్తివేయాలని కోరుతూ జిల్లాలోని బొబ్బిలిలోని లక్ష్మీ శ్రీనివాస జూట్మిల్లు వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. ఎలాంటి మందుస్తు సమాచారం ఇవ్వకుండా లాకౌట్ విధించడంతో 1000 మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జూట్మిల్లు యాజమాన్యం ఆదివారం అర్ధరాత్రి లాకౌట్ ప్రకటించింది. సోమవారం వేకువ జామున 5 గంటలకు కార్మికులు విధులకు హాజరయ్యేందుకు వెళ్లగా జూట్మిల్లు గేటు మూసేసి ఉంది. దీంతో ఆగ్రహానికి గురైన కార్మికులు విజయనగరం-రాయగడ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపడుతున్నారు.
దీంతో రహదారికి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు ఆందోళన చేపట్టిన కార్మికుల వద్దకు వచ్చిన సీఈఓ శర్మపై కార్మికులు దాడికి దిగి, అతడిని నిర్బంధించారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ప్రస్తుతం పరిస్ధితి అదుపులోనే ఉంది.
ప్రస్తుతం పోలీసులను తోసుకొని వచ్చిన కార్మికులు కొంతమంది జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతున్నారు. ఈ లౌకట్కు కారణం కార్మికులు, యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదమే కారణమని తెలుస్తోంది.
అయితే కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుండా యాజమాన్యం లాకౌట్ చేయడంతోనే తాము ఆందోళనకు దిగామని కార్మికులు తెలిపారు.