స్వచ్ఛ విశాఖ: చీపురు పట్టిన పురంధేశ్వరి
విశాఖపట్నం: హుదుద్ తుపాను బీభత్సానికి పచ్చదనం కోల్పోయిన విశాఖపట్నం నగరానికి పూర్వ వైభవం తెచ్చేందుకు నేతలు కృషి చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఎంపీ కంభంపాటి హరిబాబు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి స్వచ్ఛ విశాఖ కార్యక్రమాన్ని చేపట్టారు.
విశాఖ బీచ్ పరిశుభ్రతకు నగరవాసులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వివిధ సంస్దల ప్రతినిధులతో కలిసి బీచ్లో ఉన్న వ్యర్ధాలను తొలగించారు. ఈ సందర్బంగా విశాఖ ఎంపీ కంభపాటి హరిబాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయని, రెండు మూడు రోజుల్లో విశాఖ నగరం పరిశుభ్రం కానుందని చెప్పారు.
ప్రతీ ఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎం. నాగేంద్ర, పీవీ నారాయణ రావు, మాధవ్, తదితరులు పాల్గొన్నారు.
ఇది ఇలా ఉంటే నగరంలోని 10వ వార్డులో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి నారాయణ స్వయంగా జేసీబీని ఆపరేట్ చేసి రోడ్లపై ఉన్న చెట్లను మంత్రి తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ విశాఖలో తుపాను బీభత్సానికి కూలిన చెట్లు, చెత్తా చెదారం తొలిగింపును మరో నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు.
విశాఖకు భారీగా వచ్చిన కూరగాయలు
హుదుద్ తుపాను బాధితుల కోసం దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి భారీగా కూరగాయలు విశాఖ నగరానికి చేరాయి. అయితే మూడు రోజులైనా అధికారులు కూరగాయాలను లారీల నుంచి దింపించకపోవడంతో చెడిపోతున్నాయి.
వీటిని దించి వెంటనే బాధితులకు అందిచకపోతే తినేందుకు పనికిరాకుండా పోతాయని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఐతే కూరగాయలను అధికారులు ఎందుకు దించడం లేదో మాత్రం అర్ధం కావడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు.