బాబుకు ధీటుగా!: పురంధేశ్వరికి బీజేపీ కీలక బాధ్యత, కర్నాటకలోను
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షా కీలక బాధ్యతలు అప్పగించారు. పురంధేశ్వరికి మహిళా మోర్చా బాధ్యతలను అప్పగించారు. అలాగే బీజేపీ కర్నాటక విభాగం కో ఇంఛార్జిగా బాధ్యతలను అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంఛార్జిగా సిద్ధార్థ్ నాథ్ సింగ్ను నియమించారు. తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జిగా కృష్ణదాస్ను నియమించారు. పురంధేశ్వరికి మహిళా మోర్చా బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
పురంధేశ్వరి సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేశారు. అనంతరం విభజన నేపథ్యంలో... ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ తరఫున రాజంపేట నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
పురంధేశ్వరి బీజేపీలో చేరిన తర్వాత ఇప్పుడు మహిళా మోర్చా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. చంద్రబాబు అంటే పురంధేశ్వరికి పడదు అనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు మహిళా మోర్చా బాధ్యతలు అప్పగించడం గమనార్హం. టీడీపీకి ధీటుగా ఏపీలో ఎదగాలని బీజేపీ భావిస్తోంది.