వేడెక్కిన ఏపీ రాజకీయాలు: బీజేపీపై విమర్శలు, స్పందించిన పురంధేశ్వరి
అమరావతి: ఏపీకి హోదా ఇవ్వలేమని కేంద్రం చేతులెత్తేసిన నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పిన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ప్రెస్మీట్ పెట్టి బీజేపీ, కాంగ్రెస్లపై నిప్పులు చెరిగి ఎన్టీఏ నుంచి బయటికొచ్చేందుకు సిద్ధమని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.
మరోవైపు ఏపీకి ప్రత్యేకహోదా సాధించలేని టీడీపీ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఏపీలోని బీజేపీ నేతలపై కూడా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీపై విమర్శలు వస్తోన్న క్రమంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి స్పందించారు.
శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా ఉండబోదని 14వ ఆర్థిక సంఘం ఆనాడే చెప్పిందని అన్నారు. అయినప్పటికీ ఏపీని అన్ని విధాలా బీజేపీ అండగా నిలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్రం మన రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం చేయబోదని ఆమె తెలిపారు.
కేంద్రం ఏపీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుతుందని, కచ్చితంగా మాట నిలబెట్టుకుంటుందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను బీజేపీ చేయలేదని, ఆనాడు సమన్యాయం చేయాలని మాత్రమే బీజేపీ అడిగిందని ఈ సందర్భంగా ఆమె పేర్కోన్నారు. ఏపీ రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు బీజేపీ కృషి చేస్తుందని ఆమె చెప్పారు.