బాలకృష్ణకు 'వైస్రాయ్' తెలుసు: బాబుతో శత్రుత్వంపై పురంధేశ్వరి, లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ పెళ్లిపై..
మంత్రి నారా లోకేష్ ప్రమాణ స్వీకారోత్సవానికి తనకు ఆహ్వానం అందలేదని, స్వర్గీయ ఎన్టీఆర్ చరిత్రలో వైస్రాయ్ ఓ భాగమని, తన సోదరుడు బాలకృష్ణ ఆయనపై సినిమా తీస్తే అది ఉండాల్సిందేనని పురంధేశ్వరి అన్నారు.
విజయవాడ: మంత్రి నారా లోకేష్ ప్రమాణ స్వీకారోత్సవానికి తనకు ఆహ్వానం అందలేదని, స్వర్గీయ ఎన్టీఆర్ చరిత్రలో వైస్రాయ్ ఓ భాగమని, తన సోదరుడు బాలకృష్ణ ఆయనపై సినిమా తీస్తే అది ఉండాల్సిందేనని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి అన్నారు.
ఆమె ఆదివారం ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో విభేదాలు, ప్రత్యేక హోదా, ఏపీలో బీజేపీ ఎదుగుదల, ఎమ్మెల్యేల ఫిరాయింపులు, ఎన్టీఆర్ జీవితంపై సినిమా, జనసేనతో పొత్తు, భువనేశ్వరితో సంబంధాలు తదితర ఎన్నో అంశాలపై స్పందించారు.
చంద్రబాబు పాలనకు మార్కులు..
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలనకు మార్కులు వేసే పరిస్థితి, స్థాయి తనకు లేదని పురంధేశ్వరి అన్నారు. ఆయనకు ప్రజలు మార్కుల వేస్తారని చెప్పారు.
చంద్రబాబుతో శతృత్వం లేదు, భువనేశ్వరితో..
ఏపీ సీఎం చంద్రబాబుతో తనకు ఎలాంటి శతృత్వం లేదని పురంధేశ్వరి చెప్పారు. కేవలం భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సతీమణి, తన సోదరి భువనేశ్వరితో సంబంధాలపై మాట్లాడుతూ.. రాజకీయాల ప్రభావం కుటుంబాలపై పడవద్దని తాను భావిస్తానని చెప్పారు. తన వైపు నుంచి అలాంటి ఆలోచన లేదన్నారు. అవతలి వైపు నుంచి కూడా అలాగే ఉండాలన్నారు.
అనుకోకుండా రాజకీయాల్లోకి, పార్టీ పెట్టే స్థాయి లేదు
2004లో తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో పోటీకి దిగవలసి వచ్చిందని చెప్పారు. కొత్త పార్టీ పెట్టడం అంత సులభం కాదని, తనకు ఆ స్థాయి లేదని చెప్పారు. తాను పార్టీ మారనని, అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.
అందుకే కాంగ్రెస్ నుంచి బయటకు.. తన సిఎం అభ్యర్థిత్వంపై..
పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపనందునే తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చానని పురంధేశ్వరి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున మీరు సీఎం అభ్యర్థా అని అడిగితే.. అవి తనకు తెలియదని, అన్నీ పార్టీ చూసుకుంటుందని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుతోందన్నారు. గత ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో అధికారం చేపట్టిందన్నారు. మోడీ పాలనకు ఇవి నిదర్శనం అన్నారు.
ఏపీలో టిడిపికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని కోరుకోవడంపై స్పందిస్తూ.. ఏ పార్టీ అయినా ఎదగాలనే కోరుకుంటుందన్నారు. తన పిల్లల రాజకీయ భవిష్యత్తు వారి ఇష్టమని చెప్పారు. వారిపై ఒత్తిడి లేదన్నారు. విధి, వారి ఇష్టం తన పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు.
లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడంపై పురంధేశ్వరి సమర్థన!
ఆనాడు తన తండ్రి ఎన్టీఆర్ తన ఒంటరి జీవితంలో తోడు కావాలని భావించారని, ఆయన నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. తద్వారా లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడాన్ని పురంధేశ్వరి సమర్థించారు.
తాను ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడవలేదని చెప్పారు. ఎన్టీఆర్ ఆదర్శాలకు కట్టుబడి ఉన్నానని, ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకు వెళ్తానని పురంధేశ్వరి చెప్పారు. నాటి ఎన్టీఆర్ స్ఫూర్తి ఇప్పుటి తెలుగుదేశం పార్టీలో లేదన్నారు.
బాలకృష్ణకు తెలుసు.. సినిమాలో వైస్రాయ్ ఉండాలి
ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తానని బాలకృష్ణ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పురంధేశ్వరి స్పందించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రలో వైస్రాయ్ ఓ భాగం అన్నారు. ఆ అంశం సినిమాలో తప్పకుండా ఉండాలన్నారు. చరిత్రను ఎవరూ వక్రీకరించలేరని చెప్పారు. వక్రీకరించకూడదు కూడా అన్నారు. ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి అన్ని విషయాలు బాలకృష్ణకు తెలుసునని చెప్పారు.
పవన్ కళ్యాణ్తో పొత్తుపై.. లోకేష్ ప్రమాణానికి ఆహ్వానం లేదు
పవన్ కళ్యాణ్తో పొత్తు గురించి అడగగా.. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని, అయినా అవన్నీ తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందని పురంధేశ్వరి చెప్పారు.
నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పురంధేశ్వరి హాజరు కాలేదు. దీనిపై అడగగా.. తనకు ఆహ్వానం రాలేదని చెప్పారు. అతనికి తన ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు.
ఫిరాయింపులపై..
రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే వేటు వేయాలన్నారు. చంద్రబాబు స్ఫూర్తితోనే ఏపీలో ఫిరాయింపులు జరిగాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపులపై పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఫిరాయింపులపై పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు లేఖ రాసినట్లు చెప్పారు. ఫిరాయింపుల వారి విజ్ఞతకు వదిలేస్తున్నామన్నారు.